కవిత.. ఇప్పట్లో బయటికొచ్చేలా లేరు: కస్టడీ మళ్లీ పొడిగింపు
K Kavitha: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కష్టాలు మరింత పెరిగాయి. ఇదివరకు ఆమెకు విధించిన జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 18వ తేదీ వరకు కస్టడీలో ఉండాలని ఆదేశించింది. సీబీఐ కేసులో చోటు చేసుకున్న తాజా పరిణామం ఇది.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు కవిత. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్ జైలులో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఇదే కేసులో సీబీఐ అధికారులు సైతం కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దీనితో అధికారులు ఆమెను ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా.. వాదనలను ఆలకించారు. కవిత తరఫున ప్రముఖ న్యాయవాది నీతీష్ రాణా తన వాదనలను వినిపించారు.
సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు. కవితను జ్యుడీషియల్ కస్టడీని మరి కొంతకాలం పాటు పొడిగించాలని, తమ రిమాండ్కు తరలించేలా ఆదేశాలను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని, మరింత సమాచారాన్ని ఆమె నుంచి రాబట్టాల్సి ఉందని న్యాయమూర్తికి వివరించారు. ఇప్పటికే కవితకు చెందిన 100 కోట్ల రూపాయలను అటాచ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైతం ఇంకా విచారణను ఎదుర్కొంటోన్నారని తెలిపారు.
సీబీఐ తరఫు న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. కవిత జ్యుడీషియల్ రిమాండ్ను జులై 18వ తేదీ వరకు పొడిగించారు. కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ను సైతం న్యాయస్థానం ఇటీవలే కొట్టివేసిన విషయం తెలిసిందే. కవితకు బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు అంగీకరించలేదు.












Click it and Unblock the Notifications