48గంటల్లోగా సమ్మె విరమించాలి: జూడాలపై హైకోర్టు
హైదరాబాద్: గత కొన్ని రోజుల నుంచి తమ సమస్యలను పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్న విషయం విదితమే. అయితే జూడాల సమ్మెపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జూడాల సమ్మె చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది.
జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను 48 గంటల్లోగా విరమించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సూచించింది. జూడాల ఆందోళనపై హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది.
ఈ 48గంటల్లో జూనియర్ డాక్టర్లపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. జూడాల ఆందోళన చట్ట వ్యతిరేకమని హైకోర్టు అభిప్రాయపడింది. గ్రామీణ సర్వీసు మినహా జూనియర్ డాక్టర్ల మిగితా అన్ని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వైద్య విద్యలో భాగంగా ఏడాదిపాటు గ్రామీణ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు సేవలందించాలన్న ప్రభుత్వ నిర్ణయించింది. అందుకోసం జీవో 107 తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. దీనిపై ఆగ్రహించిన జూనియర్ డాక్టర్లు అక్టోబర్ 1వ తేదీ నుంచి సమ్మె బాట పట్టారు.
అప్పటి నుంచి జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మె చేయడంతో.. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సమ్మె విరమించాలని ఇప్పటికే జూనియర్ డాక్టర్లను కోరింది.
ప్రభుత్వం చర్చలకు పిలవాలి: జూడాలు
హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం తమను చర్చలకు పిలవాలని జూనియర్ డాక్టర్లు అన్నారు. చర్చలు పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.