నల్గొండలో దారుణం: ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన పసికందు
హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని బీబీనగర్ మండలం వెంకిర్యాలలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ శివారులో ముళ్లపొదల్లో పడేశారు. అటుగా వెళ్తున్న స్థానికులకు పాప ఏడుపు వినిపించడంతో వారు పాపను గుర్తించి 108కు సమాచారం అందించారు.
సంఘటనా స్ధలానికి చేరుకున్న 108 సిబ్బంది పసికందును స్ధానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి పోలీసులకు సమాచారం అందించారు. ముళ్లపొదల్లో పడేయడంతో ఆ పాపకు తీవ్రంగా గాయాలయ్యాయి. కన్నవారే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
అనుమానాస్పద స్ధితిలో యువకుడు మృతి
కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామ శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్ధితిలో మరణించాడు. ఊరి చివరన ఉన్న చెట్టుకు ఉరేసుకుని కళ్లపెల్లి నరేష్ (23) అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఉరేసుకున్న యువకుడి చేతులు కట్టేసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.
విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు
దేవాదుల కాలువ తవ్వకాల్లో భూమి కోల్పోయిన ఓ రైతు పరిహారం చెల్లించలేదని విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపురం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన మొగిలి అనే రైతు దేవాదుల ప్రాజెక్టు కోసం తవ్వుతున్న కాలువలో భూమి కోల్పోయాడు. అందుకు పరిహారం చెల్లించకుండా అధికారులు కాలువ తవ్వకాలు చేపట్టడంతో అడ్డుకునేందుకు విషయం తాగే ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు తన ప్రయత్నాన్ని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయమై అధికారులు వివరణ కోరగా పరిహారం చెల్లించి తీరుతామని తెలిపారు. అయితే ఇక్కడే తిరకాసు వచ్చింది. పరిహారం చెల్లించే నాటికి భూమి మెగిలి పేరుమీద పట్టా లేదు. దీంతో ఆ భూమికి చెందిన పాత యజమాని ఆ పరిహారాన్ని పొందినట్లు సమాచారం.