Justice for Disha: బీజేపీకి చెక్..కేంద్ర సర్కార్ ను ఇరకాటంలో పెడుతున్న తెలంగాణా సర్కార్
జస్టిస్ ఫర్ దిశ... తెలంగాణలో సంచలనం రేపిన గ్యాంగ్ రేప్, హత్య ఉదంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రులు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఘటన జరిగిన నాటి నుండి, నిన్న సాయంత్రం వరకు సీఎం కేసీఆర్ ఘటనపై స్పందించకపోవడం, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వెరసి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, ఆడపిల్లలకు రక్షణ కరువైందని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్ష పార్టీలు తెలంగాణా సర్కార్ ను టార్గెట్ చేస్తున్న వేళ లోపం మాది కాదు అని కేంద్రాన్ని టార్గెట్ చేసింది టీ సర్కార్ .
ప్రధాని మోడీ టార్గెట్ గా తెలంగాణా మంత్రి కేటీఆర్ ట్వీట్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై దాడులను అరికట్టడంలో ఫెయిల్ అయిందని ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్న నేపథ్యంలో, ఈ ఫెయిల్యూర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిది కాదని మోడీని టార్గెట్ చేసి, కేంద్ర సర్కార్ ఏం చేస్తుంది అని రివర్స్ ఎటాక్ ప్రారంభించింది టిఆర్ఎస్ పార్టీ. అందులో భాగంగానే నిర్భయ కేసులో నిందితులకు నేటి వరకు ఉరిశిక్ష పడకపోవడాన్ని గుర్తు చేశారు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ గా ట్వీట్ల వర్షం కురిపించిన కేటీఆర్ దిశ అత్యాచారం, హత్య నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను సమూల మార్పులు చేస్తే గాని సమాజంలో మార్పు రాదని పేర్కొన్నారు. అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని సమాజం కోరుతుందని పేర్కొన్నారు.
నిర్భయ ఘటన జరిగి 7 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా దోషులకు ఉరి శిక్ష ఎందుకు పడలేదని ప్రశ్న
కరడుగట్టిన నేరస్థులు, ఘోరమైన అకృత్యాలకు పాల్పడుతున్నా మన దేశ చట్టాలు కఠిన శిక్షలు పడేలా లేవని, నిర్భయ ఘటన జరిగి 7 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు నేరస్తులకు ఉరిశిక్ష పడలేదని, అవి దేశ చట్టాల్లో ఉన్న లోపాలని పేర్కొన్నారు కేటీఆర్. అంతేకాదు 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్యచేసిన ఘటనలో కింది కోర్టు ఉరిశిక్ష వేసే, హైకోర్టు దాని తీవ్రతను తగ్గించడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తానికి తెలంగాణ సర్కార్ ఏం చేస్తుంది అని పౌరసమాజం మండి పడుతున్న తరుణంలో చట్టంలో ఉన్న లోపాలకు తాము కారణం కాదని, దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం అని, దృష్టి సారించాల్సి ఉంది కేంద్రమేనని కేటీఆర్ తన ట్వీట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని ఇరకాటంలో నెట్టారు.
చట్టాలను సమూలంగా మార్చాలని మోడీకి విజ్ఞప్తి
ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లలో సమూల మార్పులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుందని, ఐపీసీ, సీఆర్పీసీ లలో మార్పులు అవసరమని పేర్కొన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తుత చట్టాల మార్పులు అంశంపై చర్చ జరగాలని పేర్కొని దిశ కేసు నిందితులకు శిక్ష పడాలి అంటే అందుకు కేంద్రమే నడుం బిగించాలని, చట్టాలను మార్చాలని బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టారు.
తెలంగాణా బీజేపీ నేతల విమర్శలకు చెక్ పెట్టేలా కేంద్రాన్ని ఇరకాటంలో నెట్టిన మంత్రి
ఒకపక్క బిజెపి నాయకులు తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇంత దారుణం జరిగిన స్పందించలేదని, తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిలకు భద్రత కరువైందని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో నిర్భయ కేసు ఏమైంది అని ప్రశ్నించి, కేంద్రానికి తలనొప్పి పెంచారు కేటీఆర్ . ఇక దిశ కేసు విషయంలో కూడా కీలక భూమిక పోషించాల్సింది కేంద్ర సర్కారు అని చెప్పి బీజేపీ నాయకులకు షాక్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగితే, ఢిల్లీలో ప్రకంపనలు కలుగుతున్నాయని, నిర్భయ ఉదంతాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారని గుర్తుచేసి ఫెయిల్యూర్ మాది కాదు కేంద్ర ప్రభుత్వానిది అన్న రీతిలో కేటీఆర్ చేసిన పని ఇప్పుడు బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టింది.

తెలంగాణా సర్కార్ అసమర్ధత విమర్శల నుండి దృష్టి మళ్లించిన మంత్రి
మన దేశంలోని చట్టాల వల్లే దోషులకు కఠిన శిక్షలు పడటం లేదని చెప్పే ప్రయత్నం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. కేటీఆర్ వరుస ట్వీట్లు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ పై విమర్శలు గుప్పించిన బిజెపి నాయకులకు అవకాశం లేకుండా పోయిందనే చెప్పాలి. ఒక్కసారిగా ప్రతిపక్ష పార్టీలన్నిటి దృష్టి తెలంగాణ ప్రభుత్వం మీద నుండి, కేంద్ర ప్రభుత్వం మీదికి మరలేలా చేశారు కేటీఆర్.

ఆర్టీసీ సమ్మెలోనూ కేంద్ర చట్టమే ఆయుధం ... ఇప్పుడు కేంద్రానిదే బాధ్యత
మొన్నటికి మొన్న ఆర్టీసి సమ్మె విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మోటార్ వెహికల్ చట్టం ద్వారానే ఆర్టీసీ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నామని మెలిక పెట్టి కేంద్ర సర్కారును మధ్యలో ఆయుధంగా వాడిన టిఆర్ఎస్ , ఇప్పుడు దిశ అత్యాచారం,హత్య విషయంలో కూడా కేంద్రానిదే బాధ్యత అని పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ చట్టాలను సమూల మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొని నిర్భయ ఉదంతాన్ని గుర్తు చేయడం తో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. నిన్నటి వరకు తెలంగాణా సర్కార్ కోర్టులో ఉన్న బాల్ ను కేంద్రం కోర్టులోకి నెట్టి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేపనిలో పడింది తెలంగాణా సర్కార్ .












Click it and Unblock the Notifications