Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శోభన్‌బాబు సినిమా, పూతరేకులంటే తెలీదు: కేసీఆర్ స్పీచ్ అద్భుతం

హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పూతరేకుల గురించి చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అంతేగాక, ఆయన తన బాల్యంలో ఎదుర్కొన్న భాషాపరమైన ఇబ్బందులను తనదైన శైలిలో వివరించారు.

ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌ ఎల్‌బీ మైదానంలో శుక్రవారం సాయంత్రం వైభవోపేతంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్‌, కేటీ రామారావు, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీలు బండారు దత్తాత్రేయ, జితేందర్‌రెడ్డి, కేశవరావు, అసదుద్దీన్‌ ఒవైసీ, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కవులు, కళాకారులు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు.

శోభన్ బాబు సినిమా చూశా..

శోభన్ బాబు సినిమా చూశా..

ప్రపంచ తెలుగు మహాసభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పుడు నటుడు శోభన్‌బాబు చిత్రం చూశాను. అందులో సినీ గేయ రచయిత పూతరేకుల లేతసొగసు.. ఇలా చరణం రాశారు. అప్పుడు పూతరేకులు అంటే నాకు అర్థం కాలేదు. అప్పట్లో సినిమా థియేటర్ల బయట పాటల పుస్తకాలు అమ్మేవారు. అప్పుడు అక్కడ పుస్తకం కొని చూశాను. పూత రేకుల తియ్యదనం అని ఉంది. మరుసటి రోజు బడికి వెళ్లాను. అక్కడ మా గురువు గారిని ఆ పదానికి అర్థమేమిటని అడిగా. ఆయన పూల రేకులై ఉంటాయిరా అన్నారు. కానీ మళ్లీ ఆ పదం చెప్పు అని కాగితంపై రాసుకున్నారు' అని తెలిపారు.

పూతరేకులకు అర్థం తెలిసిందిలా..

పూతరేకులకు అర్థం తెలిసిందిలా..

‘ఆ పదాని(పూతరేకులు)కి అర్థం కనుక్కొని చెబుతానన్న గురువు గారు.. విజయవాడలోని ముదిగొండ వీరభద్రయ్య గారికి లేఖ రాశారు. దీంతో ఆయన ఆ పదానికి ‘తియ్యదనం' అని జవాబుగా ప్రత్యుత్తరం పంపారు. గురు శిష్యుల బంధాన్ని మరింత బలోపేతం చేసిన మార్గదర్శకులు మృత్యుంజయ శర్మ, వీరభద్రయ్య' అని కేసీఆర్ వివరించారు. అంతేగాక, ఉత్తర గోగ్రహణం పద్యాన్ని అప్పజెప్పిన వారికి బహుమతి ఇస్తానని మృత్యుంజయ శర్మ చెప్పడంతో అప్పటికప్పుడే ఐదుసార్లు మననం చేసుకుని.. భీష్మ ద్రోణ కృపాది ధన్వికరాబీలంబు.. పద్యాన్ని కంఠతా అప్పజెప్పానని సీఎం జ్ఞాపకం చేసుకున్నారు. వెంటనే మృత్యుంజయశర్మ పాఠశాల ప్రధానోపాధ్యాయుని సమక్షంలో తనకు నోట్‌బుక్ బహుమతిగా ఇచ్చారని తెలిపారు. తనకు లభించిన ఈ సాహిత్యాభినివేశం గురువులు పెట్టిన జ్ఞానభిక్షని చెప్పారు. గొప్ప గురువులు శిష్యులను ఉద్ధరించడం వల్లే ఈనాటికీ తెలుగు భాష గొప్పతనం, విశిష్టతలు నిలిచి ఉన్నాయని కేసీఆర్ అన్నారు.

ఉపాధ్యాయుల చేతుల్లోనే..

ఉపాధ్యాయుల చేతుల్లోనే..


‘ఒకటి నుంచి 12వ తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా నేర్చుకోవాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలుగు భాషా పండితుల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తా. ఒకప్పుడు బతకలేక బడి పంతులు అనేవారు.. అది తప్పు. సమాజం భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. దేశాన్ని, సమాజాన్ని బతికించే మార్గం చూపించే వాళ్లు వారే. తెలుగు భాష వికసించాలంటే ఒక భాషా పండితుడు మరో పండితుడ్ని, ఒక కవి మరో కవిని తయారు చేయాలి' అని కేసీఆర్‌ సభకు వివరించారు. ‘అతి చిన్న, సులభ పదాలతో సాహిత్యం అందించిన మహాకవి బమ్మెర పోతన. సరళమైన, కమ్మనైన పదాలతో సాహిత్యం అందించిన జ్ఞానపీఠం సి నారాయణ రెడ్డి. సామాన్యులకు అర్థమయ్యే పదాలతో సాహిత్యం అందించారు' అని కేసీఆర్ కొనియాడారు.

అమ్మ ఒడి.. తొలి బడి

అమ్మ ఒడి.. తొలి బడి

అమ్మ ఒడి తొలి బడి అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఏ బిడ్డ అయినా అమ్మ ఒడిలోనే మొదటి పాఠాలు నేర్చుకుంటుందన్నారు. జో అచ్యుతానంద జోజో ముకుందా.. లాలిపరమానంద.. రామగోవిందావంటి జోలపాటలతో తల్లి తన బిడ్డ గోవిందుడు, అచ్యుతుడు కావాలని కోరుకుంటుందంటూ భావాన్ని వివరించారు. జోలపాటల నుంచే తెలుగు తీయదనాన్ని పసిబిడ్డలు ఆస్వాదిస్తారని చెప్పడానికి ఇవి ఉదాహరణలని పేర్కొన్నారు. ఆ విధంగా చిన్ననాటి నుంచి అమ్మానాన్నలు, గురువుల చెరగని ముద్రలు తనపై ఉన్నాయని కేసీఆర్ వివరించారు.

మనది గొప్ప సాహిత్యం

మనది గొప్ప సాహిత్యం

తెలంగాణ గొప్ప సాహిత్య మాగాణమని కేసీఆర్ ఉద్ఘాటించారు. ధిక్కార స్వరం ఈ నేలమీదనే ఉందని చెప్పారు. బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్‌కూళలకిచ్చి అప్పడుపుకూడు భుజించుట కంటె సత్కవుల్ హాలికులైననేమి.. అంటూ పోతన పద్యాన్ని ఉదహరించారు. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు నేరును ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము అంటూ సుమతీ శతక పద్యాలను గుర్తుచేశారు. చిన్నతనంలోనే భక్తిభావం పెంపొందేలా తాను గురువుల వద్ద శ్రీరాముని దయ చేతను నారూఢిగ సకల జనులు నౌరాయనగా అనే పద్యాన్ని నేర్చుకున్నానన్నారు. చిన్న పిల్లలందరికీ ఈ పద్యంతోనే తెలుగు భాష నేర్పుతారని, ఆ తర్వాతనే సమీపంలోని గుడికి వెళ్లి అక్షరాభ్యాసం చేయిస్తారని, ఇది తెలంగాణలో ఉన్న సంప్రదాయమని అన్నారు. ఇటువంటి గొప్ప సంప్రదాయాలు కనుమరుగై పోతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు.పాల్కురికి సోమన్న, బమ్మెర పోతన్న, భక్తరామదాసు, సుకవితా పయోనిధి దాశరథి, ప్రజాకవి కాళోజీ, వానమామలై వరదాచార్య, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచార్య, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత ఆచార్య సీ నారాయణరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి వంటి మహామహులు తెలంగాణ మాగాణాన్ని సాహిత్య మాగాణంగా తీర్చిదిద్దారని అభివర్ణించారు. వర్తమానతరంలో కోవెల సుప్రసన్నాచార్య, తిరుమల శ్రీనివాసాచార్య, ఆచార్య రవ్వా శ్రీహరి వంటి గొప్ప పండితులు, గొప్ప పాటలు రాస్తున్న గోరటి వెంకన్న, అందెశ్రీ, అశోక్‌తేజ, జయరాజు, నవనవలా వికాసానికి నిదర్శనంగా నిలిచిన అంపశయ్య నవీన్, సాహితీవేత్తలు ముదిగంటి సుజాతారెడ్డి, పెద్దింటి అశోక్‌కుమార్‌వంటి వారిని ఈ వేదికపైన ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఎంతోమంది ప్రముఖులను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉన్నదని, వారి భాషా సాహిత్య సేవలను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లు ఉన్నాయన్న సీఎం.. సందర్భవశాత్తు ఎవరిపేరైనా మర్చిపోయినట్లయితే మనస్ఫూర్తిగా మన్నించాలని విజ్ఞప్తిచేశారు.

గురువుకు పాదాభివందనం

గురువుకు పాదాభివందనం

మహాసభల ప్రారంభంలో సీఎం తన చిన్ననాటి గురువు మృత్యుంజయశర్మను సత్కరించారు. తెలంగాణ సంప్రదాయం ప్రకారం తిలకం దిద్ది, గంధం పూసి, అత్తరు చల్లి, శాలువాకప్పి పాదాభివందనం చేశారు. ముఖ్యమంత్రి సత్ప్రవర్తనకు, నడవడికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మురిసిపోయారు. తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి.. ముఖ్యమంత్రిని అభినందించారు. ఈ విలువలకు నిదర్శనంగా ఉన్నందునే ప్రపంచ తెలుగు మహాసభలు అనే గొప్ప ఉత్సవాన్ని నిర్వహించగలుగుతున్నారని కేసీఆర్ అన్నారు.

కవులు గురించి అద్భుతంగా

కవులు గురించి అద్భుతంగా

లక్ష్మీదేవి కటాక్షాన్ని గురించి వివరిస్తూ సిరితావచ్చిన వచ్చును, సలలితముగ నారికేళ సలిలముభంగిన్, సిరితాపోయిన పోవును, కరిమింగిన వెలగపండు రీతిని సుమతి పద్యాన్ని జ్ఞాపకం చేశారు. బంధువుల లక్షణాలను వివరిస్తూ అక్కరకు రాని చుట్టము పద్యాన్ని ప్రస్తావించారు. ధీరులు మాత్రమే దృఢసంకల్పాన్ని వదులకుండా, కార్యదక్షతతో ఎన్ని విఘ్నాలు వచ్చినా సాధించదలచుకున్న లక్ష్యాలను సాధించుకుంటారంటూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంలో అనేకసార్లు ఉదహరించిన ఏనుగు లక్ష్మణకవి నీతి పద్యం.. ఆరంభింపరు నీచ మానవులు..ను మననంచేసుకున్నారు. జయజయహే తెలంగాణ జననీ జయకేతనం అంటూ అందెశ్రీ పాట స్ఫూర్తిని, గోరటి వెంకన్న పాట విశిష్టతలను వివరిస్తూ గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది పాట పల్లవిని వినిపించారు. మంచిగున్నదా పాట అంటూ చమత్కరించారు. ఆయన పాట పల్లవిని అందుకోగానే సభ మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగింది. గల్లి చిన్నది పాట వింటుంటే కళ్లుచెమరుస్తాయని, గరీబోళ్ల జీవన విధానం స్వయంగా చూసినట్లుగా పాట ఉంటుందని చెప్పిన సీఎం.. ఇది గోరటివెంకన్న పాటల గొప్పదనమని అన్నారు. గోరటి కవి, గాయకుడని అభివర్ణించారు. జయరాజు వానమ్మ వానమ్మ వానమ్మా.. ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మా పాట వింటున్నప్పుడు కరువు కాటకాల తెలంగాణ గుర్తుకొచ్చేలా ఉంటుందని కేసీఆర్ వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+