దేవాదుల నీటి విడుదల కేసు: కోర్టుకు హాజరైన ఉపముఖ్యమంత్రి శ్రీహరి
రాష్ట్ర ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా ధర్మసాగర రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయించారనే అభియోగంపై నమోదయిన రెండు వేర్వేరు కేసుల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం వరంగల్ కోర్టుకు
వరంగల్: రాష్ట్ర ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా ధర్మసాగర రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయించారనే అభియోగంపై నమోదయిన రెండు వేర్వేరు కేసుల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం వరంగల్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు న్యాయమూర్తి ప్రమీలాజైన్ శ్రీహరిని విచారించారు. అనంతరం వాదనల కోసం కేసులను శుక్రవారానికి వాయిదావేశారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెసు పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎలాంటి అనుమతులు లేకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ధర్మసాగర రిజర్వాయర్ నుంచి దేవాదుల నీటిని విడుదల చేశారు. దీనిపై దేవాదుల అధికారితో పాటు అప్పటి మండల అధ్యక్షుడు రాజుగారి రఘు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు పోలీసులు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కట్ట మనోజ్రెడ్డి సహా మొతం 18 మందిపై కేసు నమోదుచేశారు. కేసు విచారణలో భాగంగా గురువారం వీరంతా కోర్టుకు హాజరయ్యారు.
కోర్టులోకి వాహనశ్రేణి..
ఉపముఖ్యమంత్రి కడియ శ్రీహరి కాన్వాయ్ కోర్టులోని అంతర్గత రహదారి వరకు వచ్చింది. అక్కడే వాహనాలను నిలపడంతో కోర్టు ఆవరణలో న్యాయవాదులు, కక్షిదారులు తీవ్ర ఇబ్బందులకు గరయ్యారు. కోర్టు ఆవరణలోకి ఏస్థాయి వ్యక్తులొచ్చినా ఎవరికీ ఇబ్బంది కలుగకుండా వాహనాలను నిలుపుతారు.
న్యాయమూర్తులు సైతం క్రమపద్ధతిలో తమ వాహనాలు నిలుపుతారు. దీనికి భిన్నంగా ఉప ముఖ్యమంత్రి వాహనశ్రేణితో తాను హాజరయ్యే కోర్టు ముందు వరకు వచ్చారు. దీంతో న్యాయవాదులు, కక్షిదారులు కోర్టులోకి రాకపోకల సమయంలో అసౌకర్యానికి గురయ్యారు. ఇదే విషయమై కొందరు న్యాయవాదులు వాహనశ్రేణిలో డ్రైవర్ని ప్రశ్నించగా అతని నుంచి స్పందన కరవైంది.