వచ్చే ఎన్నికల్లో బీజేపీకి షాక్ తప్పదు; బీజేపీ నేతలు ఎందుకు మిడిసిపడుతున్నారో: కడియం శ్రీహరి
మాజీ మంత్రి, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కేంద్రంలోని బిజెపి సర్కార్ పై, తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏడేళ్లలో ఏం సాధించిందని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఎందుకు ఎగిరి పడుతున్నారో తెలియడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు బ్యాంకులను కూడా నాశనం చేస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కేంద్ర సర్కార్ పై ధ్వజమెత్తారు.
ఆ నియోజకవర్గాల్లో బీజేపీకి అనుకూల పవనాలు; మిషన్19తో విజయం సాధించాలి: బండి సంజయ్
బీజేపీకి వచ్చే ఎన్నికల్లో షాక్ తప్పదు
టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి రాష్ట్రంలో తాజా పరిస్థితులపై, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపికి వచ్చే ఎన్నికలలో ఎదురుదెబ్బ తప్పదని కడియం శ్రీహరి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ దెబ్బకు బిజెపి ఓడిపోతుందని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఓటమి తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో బిజెపి ఓటమిపాలైన విషయాన్ని కడియం శ్రీహరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రానున్న యూపీ ఎన్నికలలో ప్రధాని మోడీ, అమిత్ షా లకు కాళ్ళు విరగడం ఖాయమంటూ కడియం శ్రీహరి పేర్కొన్నారు.
ప్రగతి అంటే ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మటమా?
ప్రగతి అంటే ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మటమా అంటూ ప్రశ్నించిన కడియం శ్రీహరి బ్యాంకుల నుండి బడా వ్యాపారులు తీసుకున్న రుణాలను మాఫీ చేశారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే 15 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణాలను మాఫీ చేశారని, మరో పది లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయబోతున్నారు అంటూ ఆరోపించారు. ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ ప్యాకేజీలు ప్రకటించడం బీజేపీకి అలవాటయిందని కడియం శ్రీహరి విమర్శించారు. రాష్ట్ర విభజన హామీలను బిజెపి నిలబెట్టుకోలేకపోయిందని మండిపడిన కడియం శ్రీహరి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు తెలంగాణకు కనీసం ఒక జాతీయ ప్రాజెక్టు కూడా తీసుకురాలేకపోయారు అంటూ మండిపడ్డారు.
ఏం తెచ్చారని రాష్ట్ర బీజేపీ నేతలు మిడిసి పడుతున్నారో అర్థం కావడం లేదు
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేకపోయారు అని, బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి, గిరిజన వర్సిటీ గురించి కూడా మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఏమి ఇచ్చారని, అదనంగా ఏం తెచ్చారని రాష్ట్ర బీజేపీ నేతలు మిడిసిపడుతున్నారో అర్థం కావడం లేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి రావాల్సినవి వస్తున్నాయి తప్పా బిజెపి ఎంపీలు అదనంగా తీసుకొస్తున్నవి ఏమీలేదని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాలకు అనేక కేంద్ర విద్యా సంస్థలను ఇచ్చారని, బిజెపి నేతల పలుకుబడితో రాష్ట్రానికి ఒక కేంద్ర విద్యా సంస్థను అయినా తీసుకొచ్చారా అంటూ ప్రశ్నించారు కడియం శ్రీహరి.
బండి సంజయ్, కిషన్ రెడ్డి వల్ల తెలంగాణకుఏం ప్రయోజనం లేదు
రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాల్సిన బిజెపి నాయకులు ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. దేశంలో సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు కడియం శ్రీహరి. తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ మంత్రులు ప్రశంసలు కురిపించారు అని గుర్తు చేశారు. బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్ల తెలంగాణకు ఒక్క ప్రయోజనం కూడా చేకూరలేదని కడియం శ్రీహరి విమర్శించారు.
కేసీఆర్ బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేస్తారని బీజేపీ నేతలకు భయం
కెసిఆర్ అంటే బిజెపి నేతలకు భయం పట్టుకుందని ఎక్కడ బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తారో అన్న భయంతోనే బిజెపి నేతలు కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. రానున్న రోజుల్లో కచ్చితంగా యాంటీ బీజేపీ పార్టీలన్నీ ఏకమవుతాయి అంటూ కడియం శ్రీహరి అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి షాక్ తప్పదని పేర్కొన్న కడియం శ్రీహరి తెలంగాణ బిజెపి నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.