మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నా ఎర్రబెల్లికి సిగ్గనిపించటం లేదు!!
బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తాజాగా బిఆర్ఎస్ పార్టీ నేతల పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపిని అడ్డుకునే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని తను కాంగ్రెస్లో చేరానని చెప్పిన కడియం శ్రీహరి తనపై చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నేతలందరి చిట్టాలు తన దగ్గర ఉన్నాయని అది బయటపడితే తట్టుకోలేరు అంటూ వార్నింగ్ ఇచ్చారు.
కేసీఆర్ గురించి మాట్లాడను
బిఆర్ఎస్ ను వీడడం తనకు కొంత బాధగానే అనిపిస్తున్నదని, కెసిఆర్ పై తనకు గౌరవం ఉందని, ప్రత్యేకంగా కెసిఆర్ పై తను ఎటువంటి విమర్శలు చేయదలచుకోవటంలేదు అని కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేశారు. చాలామంది పార్టీలు మారుతున్నా, ఎవరిపైనా స్పందించని బీఆర్ఎస్ నేతలు, తన పైన మాత్రం తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని, వారి పద్ధతి బాగాలేదని కొంతమంది ముఖ్య నేతలను టార్గెట్ చేశారు.

ఎర్రబెల్లిపై ఘాటు వ్యాఖ్యలు
జిల్లా స్థాయి నేతలు కూడా తనపై అనవసరపు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదంటూ కడియం శ్రీహరి పేర్కొన్నారు.ఇక ఇదే సమయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లిని టార్గెట్ చేసిన కడియం శ్రీహరి పాలకుర్తి నియోజకవర్గంలో నిన్ను ప్రజలు ఛీ కొట్టారని, ఇలాంటి అహంకారపు మాటలు వల్లే ఓడిపోయావ్ అంటూ విమర్శించారు. మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నా ఎర్రబెల్లికి సిగ్గు అనిపించడం లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు.
బట్టలిప్పి నిలబెడతాం
ఇప్పటికైనా ఇలాంటి మాటలు తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీ ఈ పరిస్థితికి రావడానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి నేతలు కారణమని కడియం శ్రీహరి పేర్కొన్నారు. పల్లా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు నిరూపించ పోతే జనగామలో నిన్ను బట్టలిప్పి నిలబెడతాం అంటూ మండిపడ్డారు.
మీ చరిత్ర అందరికీ తెలుసు.. బయటపెట్టనా?
ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా తనపై విమర్శలు చేసే వాడేనా అంటూ అసహనం వ్యక్తం చేశారు. మానకొండూరులో నీ చరిత్ర ఏమిటో ప్రజలకు తెలిసే చిత్తుగా ఓడించారని, మీరు చేసిన దారుణాలు బయట పెడితే మీరు భరించలేరు తట్టుకోలేరు అంటూ కడియం శ్రీహరి ఘాటుగా హెచ్చరించారు.












Click it and Unblock the Notifications