మోడీ ఇక చాలు.. కేసీఆర్ కేంద్రప్రభుత్వ పగ్గాలు చేపట్టాలి: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ మంత్రి కడియం శ్రీహరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో మోడీ పాలన ఇక చాలు అంటూ విరుచుకుపడ్డారు. కెసిఆర్ కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తెలంగాణ మోడల్ గుజరాత్ మోడల్ ను తలదన్నేలా ఉందని, అందుకే ప్రజలు దేశానికి కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి: దేశం కోరుతుందన్న కడియం శ్రీహరి
కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నామని పేర్కొన్న ఆయన, ప్రస్తుత బీజేపీ హయాంలోని కేంద్రం నిర్ణయాలు దేశాన్ని తిరోగమనంలో నడిపిస్తున్నాయి అని మండిపడ్డారు. దేశాన్ని వెనక్కు తీసుకెళ్లేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని పరిశ్రమలను ప్రైవేటు రంగానికి అమ్ముకోవాలని చూస్తోందని కడియం శ్రీహరి మండిపడ్డారు. 16 కోట్ల ఉద్యోగాలు కేంద్రంలో రావాల్సి ఉంటే, కనీసం 16 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని కడియం శ్రీహరి మండిపడ్డారు.

ఉచితాలు వద్దన్న ప్రధాని మోడీ తీరు ఇలా
పేద వర్గాల పై, మైనారిటీలపై, బడుగు బలహీన వర్గాలపై ప్రధాని నరేంద్ర మోడీకి చిన్నచూపు ఉందని పేర్కొన్న కడియం శ్రీహరి వారిని సమాజం నుంచి వెలి వేయాలని చూస్తున్నారంటూ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పరోక్షంగా రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రయత్నం చేస్తుందని కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. ఉచితాలు వద్దని మోడీ అంటున్నారని, బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన సమానత్వం రానప్పుడు పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉండదా అంటూ ప్రశ్నించారు.

తెలంగాణా ముందడుగు వేస్తుంటే అడ్డుకునే యత్నం చేస్తున్న బీజేపీ
దేశంలో మత ఘర్షణలు సృష్టించడం కోసం బీజేపీ పని చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందడుగు వేస్తుందని పేర్కొన్న కడియం శ్రీహరి దానిని నిలువరించే ప్రయత్నం కేంద్రం చేస్తోందంటూ ఆరోపించారు. కార్పొరేట్లకు 12 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర పెద్దలు మాఫీ చేశారని కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. ఎనిమిది ఏళ్లలో మోడీ ఎన్నో వేషాలు వేశారని, అవన్నీ ప్రజలను మోసం చేయడానికే అని కడియం శ్రీహరి విమర్శించారు.

కార్పోరేట్లకు లక్షల కోట్ల మాఫీ.. నీ అయ్యా జాగీరా? ప్రశ్నించిన కడియం శ్రీహరి
ప్రజల సొమ్మును కార్పొరేట్లకు దారాదత్తం చేయడానికి సిగ్గు ఉండాలి అంటూ మండిపడిన కడియం శ్రీహరి కార్పొరేట్లకు 12 లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేయడం నీ అయ్య జాగీరా.. నీ తాత సొమ్మా .. అంటూ ప్రశ్నించారు. దేశ్ కి నేత గా కేసీఆర్ దేశ పగ్గాలు చేపట్టాలని కడియం శ్రీహరి ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న కారణంగానే కేంద్రం తెలంగాణా ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అయినా భయపడేది లేదని, తెలంగాణా ప్రజలు, నేతలు ఉద్యమకారులని కడియం శ్రీహరి వెల్లడించారు.












Click it and Unblock the Notifications