కేసీఆర్ ఫ్యామిలీకి 'కాళేశ్వరం' ఏటీఎంలా మారింది-ఆ విషయంలో ఓవైసీకి భయపడ్డారా : హుజురాబాద్లో కేంద్రమంత్రి
కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎంలా మారిందని కేంద్రమంత్రి మురళీధరన్ విమర్శించారు. కమిషన్ల కోసమే ఆ ప్రాజెక్టును నిర్మించారని... దానివల్ల ఎవరికీ ప్రయోజనం చేకూరలేదని అన్నారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.40వేల కోట్లు నుంచి రూ.1,30,000 కోట్లకు పెంచారని ఆరోపించారు. ఎన్నో ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పేదల బతుకులు మారలేదన్నారు. ఏడున్నరేళ్ల కేసీఆర్ పాలనలో ఎన్నో హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. ఆదివారం(సెప్టెంబర్ 5) హుజురాబాద్లో నిర్వహించిన గౌడ గర్జన సభలో మాజీ మంత్రి ఈటల రాజేందర్తో కలిసి కేంద్రమంత్రి మురళీధరన్ పాల్గొన్నారు.

ఓవైసీకి భయపడ్డారా : కేంద్రమంత్రి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే దళితుడే మొదటి ముఖ్యమంత్రి అని ప్రకటించిన కేసీఆర్... ఆ మాట నిలబెట్టుకోలేదని కేంద్రమంత్రి మురళీధరన్ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు,దళితులకు మూడెకరాల భూమి,రుణమాఫీ... ఇలా ఏ హామీని నెరవేర్చలేదన్నారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే కేసీఆర్కు ప్రజలు గుర్తుకొస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఎన్నడూ సచివాలయానికి కూడా వెళ్లలేదన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని... 1400 మంది యువత బలిదానాలు చేసింది ఇందుకోసం కాదని అన్నారు. తెలంగాణ ఏర్పడితే సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని పాటిస్తామని ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్... ఇప్పుడెందుకు దాన్ని పాటించట్లేదని ప్రశ్నించారు. ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీకి భయపడ్డారా అని ప్రశ్నించారు.

కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇచ్చినా : కేంద్రమంత్రి
కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని వినియోగించుకోవట్లేదన్నారు.ప్రధానమంత్రి ఆవాస్ యోజనా,రోడ్లు,డిజిటల్ కనెక్షన్ వంటి పథకాల కోసం తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక కేసీఆర్కు ఒక హెచ్చరిక లాంటిదని అన్నారు. ఏడేళ్లుగా కేసీఆర్కు గుర్తుకురాని దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు.దళిత బంధు పథకాన్ని బీజేపీ స్వాగతిస్తోందని.. అయితే మిగతా కులాల వారికి కూడా రూ.10లక్షలు చొప్పున సాయం చేయాలని డిమాండ్ చేశారు.

అందరి మద్దతు బీజేపీకే : ఈటల రాజేందర్
నరేగా పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.15738 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి అందించిందని... కానీ అందులో రూ.7500 కోట్లు కేసీఆర్ దారి మళ్లించారని ఆరోపించారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు భావిస్తున్నారన్నారు.కేంద్రంలో 40 మంది ఓబీసీలకు ప్రధాని మోదీ కేబినెట్లో చోటు కల్పించారని అన్నారు.
తెలంగాణలోనూ ముదిరాజ్,విశ్వబ్రాహ్మణ,విశ్వకర్మలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలన్నారు. ఇదే సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ... 17శాతం పైచిలుకు జనాభా ఉన్న దళితుల నుంచి కేవలం ఒక్కరికే మంత్రివర్గంలో చోటు కల్పించారని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాలు,గ్రూపులు బీజేపీకి మద్దతునిస్తున్నాయని అన్నారు.












Click it and Unblock the Notifications