కల్యాణ లక్ష్మి కాంతులు.!రెండు కోట్ల చెక్కుల పంపిణీ.!సంక్షోభంలో కూడా తగ్గేది లే అంటున్న గంగుల.!
హైదరాబాద్: పేద ప్రజలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం వరం లాంటిదని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.పేద ప్రజల కుటుంబాల్లో సంతోషం నింపేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు మంత్రి గంగుల కమలాకర్.
కరోనా వల్ల రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు.. ఐనా సంక్షేమ పథకాలకు ఢోకా లేదంటున్న మంత్రి గంగుల..
కరోనా వల్ల రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు, కూలీలు, వ్యవసాయ కార్మికులు, బీడీ కార్మికులు ఒంటరి మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తుందన్నారు. ప్రభుత్వ అంతిమలక్ష్యం ప్రజా సంక్షేమమేనని గంగుల స్పష్టం చేసారు.
ధాన్యం మొత్తం కొంటాం.. సహరించాలని రైతులకు గంగుల విజ్ఞప్తి..
గతంలో కరెంటు సరఫరా లేక రైతాంగం అనేక ఇబ్బందులు పడే వారని తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రైతాంగానికి 24 గంటలు ఉచితంగా విద్యుత్తు అందించడం జరుగుతుందన్నారు. ఎండాకాలంలో నీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారని నేడు ఆ సమస్య లేదన్నారు. కరోనా సమయంలో కూడా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతుల నుండి ధాన్యం మొత్తం తూకం వేసే క్రయంలో గానీ, మార్కెట్ యార్డులకు తరలించే క్రమంలొ కాస్త ఆలస్యం జరుగుతోందిని, రైతులు సహకరించాలని గంగుల కోరారు.
242 మంది లబ్ధిదారులకు ప్రయోజనం.. 2 కోట్ల 42 లక్షల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ
మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రతి పథకంలో డబుల్ బెడ్ రూమ్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్ లను మహిళలకు ప్రభుత్వం అందిస్తుందన్నారు. బంగారు తెలంగాణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహిళలంతా ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావు ను నిండు నూరేళ్లు బతకాలని దీవించాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా మంత్రి 242 లబ్ధిదారులకు రెండు కోట్ల నలభై రెండు లక్షల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. పది రోజుల్లో మిగిలి ఉన్న 622 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
Recommended Video
సంక్షేమ పథకాలు అమలు చేయడమే లక్ష్యం.. దేశంలోనే మొదటి స్ధానంలో ఉన్నామన్న మంత్రి..
అంతే కాకుండా నీరుపేద ప్రజలకు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం వరంలాంటిదని మంత్రి స్పష్టం చేసారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు,నగర మేయర్ వై. సునీల్ రావు, ఆర్ డి ఓ ఆనంద్ కుమార్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప-హరిశంకర్ సుడా చైర్మన్ జీవి రామకృష్ణ రావు, కొత్తపల్లిల మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు ఫ్యాక్స్ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి, కరీంనగర్ రూరల్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య కొత్తపల్లి జడ్పిటిసి పిట్టల కరుణా - రవీందర్, సుంకిశాల సంపత్ రావు, తహశీల్దార్లు కార్పొరేటర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.