ఆ ఏఎస్సై తెలుగు సినిమా నిర్మాతలకు వడ్డీకి డబ్బులిచ్చాడు!
అదిలాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కరీంనగర్ జిల్లా ఏఎస్సై మోహన్ రెడ్డి, మరికొందరు కలిసి పలువురు తెలుగు సినిమా నిర్మాతలకు ఫైనాన్స్ ఇచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆరోపణలు ఎదుర్కొంటున్న మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ వద్ద కళ్లు చెదిరే ఆస్తులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఓ ఫంక్ష్ హాల్, పెట్రోల్ బంక్, జాతీయ రహదారి 44 దగ్గర ఇటీవలే 7 ఎకరాల భూమి కొనుగులు చేసినట్లు గుర్తించారని తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీకి ఫైనాన్స్ చేశారు.
సమాచారం మేరకు... మోహన్ రెడ్డితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సినిమా నిర్మాతలకు ఫైనాన్స్ చేసినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆ సినిమా విడుదలైనట్లుగా చెబుతున్నారు.
కాగా, ఏఎస్సైగా విధులు నిర్వర్తించే మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారంతో ఎందరి జీవితాల్లోనో చిచ్చు పెట్టినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అతడిని విచారించే కొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. ఇతడితోపాటు చేతులు కలిపి అతడి వడ్డీ వ్యాపారంలో పాలుపంచుకున్న మరికొందరి పోలీసు అధికారుల పేర్లు కూడా బయటకు వస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.