తెలంగాణలో కర్ణాటక రిపీట్, 2019లో మనమే కీలకం: ‘జై తెలంగాణ’ అంటూ చంద్రబాబు
Recommended Video

హైదరాబాద్: తెలంగాణలోని కార్యకర్తలు, నేతలకు సమయం ఇవ్వన్నందుకు తనకు కూడా బాధగా ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ టీడీపీ మహానాడులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15రోజులకోసారి అయినా మా వాళ్ల కోసం గంట సమయం ఇవ్వండని మోహన్ రావు అన్నారని చెప్పారు. పార్టీ కార్యకర్తలతో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఎన్నికష్టాలొచ్చినా పార్టీని వీడలేదని కార్యకర్తలను అభినందించారు.

మనమే ముందుండాలి
విభజనతో ఏపీకి కట్టుబట్టలతో వెళ్లామని, ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్పారు. అయితే, తమకు అపజయం అంటే తెలియదని అన్నారు. ధైర్యంగా ముందుకెళ్తున్నామని అన్నారు. దేశంలో ఏపీ, తెలంగాణలు అభివృద్ధిలో ముందుండాలని మరోసారి ఆకాంక్షించారు చంద్రబాబు.

కర్ణాటకలో జరిగిందే తెలంగాణలో రిపీట్
‘రేపు ఎన్నికల్లో చంద్రన్న మేమున్నాం' అని సంకేతం ఇస్తున్నారని కార్యకర్తలనుద్దేశించి అన్నారు. కర్ణాటకలో జరిగిందే.. తెలంగాణలో రిపీట్ అవుతుందని చంద్రబాబు అన్నారు. కర్ణాటకలో తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్ పార్టీనే సీఎం పదవిని పొందిన విషయం తెలిసిందే. టీడీపీ ఏం చేస్తుందో ప్రజలకు తెలపాలని కార్యకర్తలకు చెప్పారు. తెలంగాణకు నష్టం చేసే బాబ్లీకి వ్యతిరేకంగా గతంలో టీడీపీనే పోరాటం చేసిందన్నారు.

2019లో మనమే కీలకం
కర్ణాటకలో జేడీఎస్, ఇతర పార్టీ నేతలంతా కలిసి ఏపీకి న్యాయం చేస్తారని అనిపించిందని చంద్రబాబు చెప్పారు. టీడీపీ లేకుండా 2019లో ఎవరు ఏమీ చేయలేరని, కీలక పాత్ర మనదేనని చంద్రబాబు చెప్పారు. ప్రధానిని నిర్ణయించేది మనమేనని చెప్పారు. 27,28,29 తేదీల్లో అమరావతిలో మహానాడు ఉందని చెప్పారు.స్వార్థం కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
తన మీద నమ్మకం పెట్టుకోండి, అంతా చూసుకుంటానని చంద్రబాబు చెప్పారు.

వెంకన్నతో పెట్టుకుంటే ఖతమే..
బీజేపీ దుర్మార్గపు రాజకీయాలు చేస్తోందని, వెంకన్నను కూడా రాజీకయాల్లోకి తీసుకోస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. నగలు తన దగ్గర ఉన్నాయని, రికార్డులో లేని వజ్రాలు ఉన్నాయని అంటున్నారని చెప్పారు. వెంకన్నతో పెట్టుకుంటే మీ పని ఖతమంటూ హెచ్చరించారు. వెంకన్నతో పెట్టుకుంటే ఈ జన్మలోనే శిక్షలు పడతాయన్నారు.

జై తెలంగాణ అంటూ చంద్రబాబు.. పూర్వ వైభవం
23క్లైమోర్ మైన్లు పెట్టినా తనను వెంకన్నే కాపాడారని చంద్రబాబు చెప్పారు. బీజేపీ నాటకాలు తమ దగ్గర సాగవని అన్నారు. నాలుగేళ్లలో ఏం చేశారో ప్రజలకు చెప్పాలని అన్నారు. తెలంగాణలో టీడీపీ తిరుగులేని శక్తిగా ఎదగాలని అన్నారు. తాము లేకుండా తెలంగాణలో ఏమీ జరగదని లన్నారు. మే 24న చరిత్ర తిరగరాసే రోజని, టీడీపీకి పూర్వ వైభవం తేవాలని చంద్రబాబు అన్నారు. తనకు ఇక్కడే ఉండిపోవాలని ఉందని అన్నారు. జై తెలంగాణ, జై ఎన్టీఆర్, టీడీపీ జిందాబాద్ అంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.












Click it and Unblock the Notifications