తెలంగాణ పట్ల వివక్ష: మోడీ ప్రభుత్వంపై టిఆర్ఎస్ నేత ఫైర్
హైదరాబాద్: తెలంగాణ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
కేంద్రం బీహార్ మాదిరిగా తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, గ్రామాల అభివృద్ధికి మాత్రమే కేంద్రం సాయం కోరుతున్నామని ఆయన అన్నారు విభజన చట్టంలోని అనేక హామీలను నెరవేర్చని కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు.
రహదారులు, విద్య, వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగా కేంద్రం సాయం కూడా అవసరమని చెప్పారు. రాష్ర్టానికి న్యాయంగా రావాల్సిన 1200 టీఎంసీల నీటిని 58 ఏండ్లు కోల్పోయామని, ఇక ఇప్పటికైనా తమ నీటిని తామే దక్కించుకోవాలని రూ. 25 వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టామని కర్నె ప్రభాకర్ అన్నారు.
దానికితోడు గోదావరి, కృష్ణా కింద ఉన్న ఆయకట్టును సశ్యశ్యామలం చేస్తామని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలకు కేంద్రం సాయం అవసరమని, తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణపై స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.