హరీష్ రావే వద్దన్నారు: కెటిఆర్ శాఖలపై కవిత, ఆంధ్రజ్యోతిపై నిప్పులు
హైదరాబాద్: మంత్రి హరీష్ రావే స్వయంగా తనకు మైనింగ్ శాఖ వద్దని చెప్పారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు చెప్పారు. తన సోదరుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వద్ద ఎన్ని శాఖలు ఉన్నాయో ఈటెల రాజేందర్ వద్ద అన్నే ఉన్నాయన్నారు.
తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలపై ఆమె మండిపడ్డారు. ప్లీనరీ నిర్వహణ, ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక, శాఖల మార్పుపై ఆమె మాట్లాడారు. కేసీఆర్ వ్యూహాల వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పదిహేనేళ్లలో తమ పార్టీ ఎన్నో కష్టాలను ఎదుర్కొందన్నారు.
ప్లీనరీలో నాలుగు వేల మంది సభ్యులు పాల్గొంటారని తెలిపారు. ప్రస్తుతం ప్లీనరీ ఏర్పాట్లలో తాము బిజీగా ఉన్నామన్నారు. పార్టీ ఫిరాయింపులు, పాలేరు ఎన్నికల అంశంపై కవిత మాట్లాడుతూ.. నైతికత గురించి మాట్లాడే హక్కు టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు లేదన్నారు.
సాంప్రదాయాలు, విలువలు అంటూ మాట్లాడుతోన్న కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను గుర్తు తెచ్చుకోవాలన్నారు. రాంరెడ్డి వెంకట రెడ్డి కుటుంబ సభ్యులపై తమ పార్టీకి సానుభూతి ఉందని, కాంగ్రెస్ పార్టీ పైన లేదన్నారు.
కాంగ్రెస్ నేతలు శ్రీకాంతాచారి తల్లిపై పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో స్పష్టమైన ప్రణాళికలతో ప్రజా సంక్షేమం దిశగా ముందుకు వెళుతున్నామన్నారు. కేసీఆర్ నిష్పక్షపాతంగా మంత్రుల శాఖలలో మార్పులు చేర్పులు జరిగాయన్నారు.
మంత్రులు కెటి రామారావు, హరీష్ రావులు ఇద్దరు తమ పార్టీకి సమానమే అన్నారు. వారిద్దరు పార్టీకి రెండు కళ్లు అని చెప్పారు. కెటిఆర్కు ఎక్కువ శాఖలు ఇచ్చారని, ప్రభుత్వంలో ప్రాధాన్యత పెరుగుతోందనే వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మంత్రి ఈటెల రాజేందర్ వద్ద ఎన్ని శాఖలు ఉన్నాయో కెటిఆర్ వద్ద అన్నే ఉన్నాయని చెప్పారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణను సాధించడమే తమ లక్ష్యమన్నారు. ఎన్నికల ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నామని, మేనిఫెస్టోలోలేని అంశాలను కూడా అమలు చేస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలంతా తమకు అండగా ఉన్నారన్నారు.
సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్లే టీఆర్ఎస్ తన లక్ష్యం వైపు నడుస్తోందని పేర్కొన్నారు. పాలసీని పక్కనబెట్టి టిడిపి కాంగ్రెస్తో దోస్తీ కట్టిందని విమర్శించారు. కాంగ్రెస్కు మద్దతు తెలిపితే ఆ పార్టీ చేసిన తప్పులకు బాధ్యులవుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలేరు అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తమను సంప్రదించడం సరికాదని వ్యాఖ్యానించారు.
ఆంధ్రజ్యోతిపై ఆగ్రహం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న సంక్షేమ పథకాలపై ఆంధ్రజ్యోతి పత్రిక తప్పుడు రాతలు రాస్తోందని కవిత విమర్శించారు. కాకతీయ కాలువ అభివృద్ధి పనులు ప్రారంభిస్తే అసత్యాలు రాస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి అబద్దాల జ్యోతి అని దుయ్యబట్టారు. అర్థ సత్యాలు చెప్పే పత్రికలను ప్రజలు నమ్మొద్దన్నారు.