కాంగ్రెస్ తో పొత్తు పై కేటీఆర్ క్లారిటీ - పీకేను మించిన వ్యూహకర్త కేసీఆర్ : షర్మిల పార్టీ వెనుక...!!
ప్రశాంత్ కిషోర్ - సీఎం కేసీఆర్ భేటీలు ... అదే సమయంలో కాంగ్రెస్ తో పొత్తు అంశం పైన మంత్రి కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. బీజేపీ..ప్రధాని పైన తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ బలహీనతే బీజేపీ బలమని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాల పైన క్లారిటీ ఇచ్చారు. రాజకీయ వ్యూహకర్తలకు ఏ విధంగా ముందుకు వెళ్లాలో సూచిస్తారు..కానీ, సీఎంలను మార్చేయ లేరని వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ వ్యూహకర్తగా మాత్రమే టీఆర్ఎస్ తీసుకుందని..ఆయన ఆకాశాన్ని కిందకు దించలేదరని చెప్పుకొచ్చారు. మారుతున్న కాలంతో పాటుగా రాజకీయంగా కొన్ని అంశాల్లోనూ మార్పులు వచ్చాయని విశ్లేషించారు. కొత్త ఓటర్లు పెరుగుతున్న సమయంలో...కొత్త వ్యహాలు అవసరమని చెప్పారు. వ్యూహకర్తల ద్వారా కొంత మేర కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పాత్ర
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం సాగుతుందని..ఆయన చేరితే అప్పుడు ఆయనతో సంబంధాల పైన ఆలోచన చేస్తామని స్పష్టం చేసారు. కాంగ్రెస్ మద్దతుతో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు అవసరం లేదని..అసలు కాంగ్రెస్ కు బలం ఎక్కడ ఉందని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయారని...కాంగ్రెస్ పుంజుకొనే అవకాశం లేదని చెబుతూ..తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. కేంద్రం పైన ఎవరైన మాట్లాడితే ఈడీ...సీబీఐ ని రంగంలోకి దించుతున్నామని బెదిరిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో పోలీసులను..ఏసీబీలను అదే విధంగా వినియోగిస్తే ఏ ప్రతిపక్ష పార్టీల నేతలు బయట ఉండరని చెప్పారు.

ఆ ఇద్దరూ హీరోల్లో ఫీలవుతున్నారు
సీఎం కేసీఆర్ ను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని..ఎప్పుడో కేసులు పెట్టేవారమని చెప్పుకొచ్చారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రధాని మోదీని గాడ్సే ఆశయాలతో పని చేస్తున్నారని చెప్పటంతో ఆయన్ను అరెస్ట్ చేసారని గుర్తు చేసారు. ఇప్పుడు తాను కూడా అదే చెబుతున్నానని.. మోదీ చెప్పేది గాంధీ మాటలు..చేసేది గాడ్సే పనులని..తనను కూడా అరెస్ట్ చేయాలంటూ సవాల్ చేసారు. కేవలం మతాల పేరుతో రెచ్చగొట్టి రాజకీయాలను చేస్తున్నారని విమర్శించారు. దొంగ పని చేసి దొరికిన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఏం చేయాలని ప్రశ్నించారు. సున్నాలు వేసుకొనే వ్యక్తి ఇప్పుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని...కరీంనగర్ లో తంబాకు తింటూ ఏదో లక్కుతో ఎంపీ అయి..ఇప్పుడు పోటుగాడులా ఫీలవుతున్నార ని వ్యాఖ్యానించారు. అసలు వీరంతా తమకు లెక్క కాదన్నారు. తాము వైఎస్సార్ - చంద్రబాబు లాంటి వారితో ఫైట్ చేసామని..వీళ్లని పట్టించుకోమని చెప్పారు.

పాదయాత్ర కాదు..అసమర్ధుడి జీవన యాత్ర
కేంద్రం ఇప్పటి వరకు తెలంగాణకు ఇచ్చింది ఏముందని ప్రశ్నించారు. తాము ఎంఐఎంతో కలిసి పోటీ చేయలేదన్నారు. కేసీఆర్ ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో ఉన్నారని స్పష్టం చేసారు. సీఎం మారాల్సిన అవసరం లేదని..హైదరాబాద్ కేంద్రంగానే జాతీయ రాజకీయాలు చేయకూడదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే..ఎవరినైనా ఉపేక్షించేది లేదని కేటీఆర్ స్పష్టం చేసారు. ఎంఐఎం ను ఏడు సీట్లకు పరిమితం చేసామని..ప్రభుత్వానికి ఎవరు మద్దతిచ్చినా తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ప్రజాసంగ్రామ యాత్ర అని యాత్రలు చేస్తున్నారని..అది అసమర్దుడి జీవన యాత్రగా అభివర్ణించారు. గవర్నర్ వ్యవస్థ ఎక్కువగా ఊహించకూడదన్నారు. ప్రధాని తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వకపోయినా...ప్రధాని ఇవ్వని మెడికల్ కాలేజీలు ఇచ్చినట్లుగా చెప్పిన గవర్నర్ గురించి ఏమనాలంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

అన్న మీద కోపం ఉంటే ఏపీలో పార్టీ పెట్టాలి
షర్మిల తాను తెలంగాణ బిడ్డ నని చెబితే..తెలంగాణ ప్రజలా అమాయకులా నమ్మటానికి అని ప్రశ్నించారు. అసలు తెలంగాణలో షర్మిల భాగస్వామ్యం ఏంటని నిలదీసారు. షర్మిల కు అన్న మీద కోపం ఉంటే ఆంధ్రాలో పార్టీలో పెట్టాలి కానీ, తెలంగాణలో పార్టీ ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. షర్మిల తండ్రి..తెలంగాణ వ్యతిరేకి అని..షర్మిల ఇక్కడ చదవచ్చని..ఉండి ఉండవచ్చని..తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ, షర్మిల - ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్ పైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని..బీజేపీ ని ఎందుకు ఏ విషయంలోనూ ప్రశ్నించరని నిలదీసారు. వీరంతా బీజేపీ ప్రోత్సాహంతో వచ్చిన శిఖండి పార్టీలని ఆరోపించారు. పలు వర్గాల్లో ఓట్లు చీలి..టీఆర్ఎస్ కు నష్టం చేయాలనేది బీజేపీ ఆలోచనగా పేర్కొన్నారు. కానీ, తెలంగాణ ఓటర్లు చాలా తెలివిగలవారని..తమకు అసలు వ్యతిరేక ఓటు లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఈటల రాజేందర్ తప్పు చేసారని.. పార్టీ వదిలి వెళ్లారని..ఇవన్నీ రాజకీయాల్లో సహజమని కేటీఆర్ చెప్పారు.












Click it and Unblock the Notifications