రోజక్క రొయ్యల దావత్లో కేసీఆర్-జగన్ రహస్య ఒప్పందం.. తప్పయితే శ్రీశైలం డ్యామ్లో దూకుతా : బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి అన్యాయం నీళ్ల విషయంలోనే జరిగిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆరే ఆ అన్యాయానికి కారకులని ఆరోపించారు. గతంలో ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల్లో తెలంగాణకు అన్యాయం జరిగేలా ముఖ్యమంత్రి వ్యవహరించారని ఆరోపించారు. 68 శాతం కృష్ణా నది పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు మాత్రమే తీసుకుని రాష్ట్రానికి అన్యాయం చేశారని అన్నారు.
కేసీఆర్ చేసిన అన్యాయానికి దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే దుస్థితి నెలకొందన్నారు. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన ఒప్పందంలో కేసీఆర్ సంతకాలు పెట్టిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు.
కేసీఆర్ ఎందుకు ఒప్పుకున్నారు... : బండి సంజయ్
మొదటిసారి జూన్ 18,19-2015లో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన భేటీలో నీటి వాటాలపై ఒప్పందం కుదిరిందని బండి సంజయ్ అన్నారు. అందులో తెలంగాణకు 299 టీఎంసీలు,ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలకు ఒప్పందం జరిగిందన్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 21,2016లో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఇదే చెప్పిందన్నారు. ఓవైపు 299 టీఎంసీలకే ఒప్పందం కుదుర్చుకుని... దానిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం తన స్టాండ్ మార్చిందన్నారు. అసలు 299 టీఎంసీలకు కేసీఆర్ ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు.
రోజక్క రొయ్యల దావత్లో... : బండి సంజయ్
అగస్టు 12,2019న జరిగిన రోజక్క రొయ్యల దావత్లో ఏపీ,తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని బండి సంజయ్ ఆరోపించారు. నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి కేసీఆర్ వెళ్లడంలో మతలబు వేరే ఉందన్నారు. ఆ దావత్ తర్వాత రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. దాని అర్థం... తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటిని కూడా ఏపీకే ఇవ్వాలని కేసీఆర్ భావించారని ఆరోపించారు. కృష్ణానదిపై ప్రాజెక్టులకు మే 5,2020న ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిందని... అగస్టు 15 నాటికి పనులు కూడా మొదలుపెట్టిందని సంజయ్ గుర్తుచేశారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఫాంహౌస్కే పరిమితమయ్యారు తప్ప ఏపీ అక్రమాలను ప్రశ్నించలేదన్నారు.
ప్రజలు తిరగబడుతారనే భయంతో ఆ లేఖ..
రోజక్క ఇంట్లో జరిగిన దావత్లో కుదిరిన ఒప్పందం కేసీఆర్ ప్రశ్నించకపోవడానికి కారణమన్నారు. ఏపీ ప్రభుత్వ జీవోపై ఆనాడు బీజేపీ స్పందించిందని... తానే స్వయంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లేఖ కూడా రాశానని సంజయ్ తెలిపారు. దీంతో ఇక ప్రజలు తిరగబడుతారేమోనన్న భయంతో చీఫ్ ఇంజనీర్ రజత్ కుమార్తో కేంద్రానికి కేసీఆర్ లేఖ రాయించారని అన్నారు. ఏపీతో 299 టీఎంసీలకు ఒప్పందం కుదుర్చుకున్న కేసీఆర్... రజత్ కుమార్తో రాయించిన లేఖలో మాత్రం తెలంగాణకు 575 టీఎంసీలు దక్కాలని పేర్కొన్నట్లు చెప్పారు.
ఏపీకి మేలు చేసేందుకే కేసీఆర్ అలా... : బండి సంజయ్
అగస్టు 5,2020న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే కేసీఆర్ దాన్ని రద్దు చేయించారని బండి సంజయ్ అన్నారు. ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ ఆ సమావేశాన్ని వాయిదా వేయించారని... తద్వారా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టేందుకు ఆయనే అవకాశం కల్పించారని ఆరోపించారు. లేకపోతే,అగస్టు 15న ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు మొదలుపెడుతుందని తెలిసి కూడా సమావేశాన్ని వాయిదా వేయించడమేంటని ప్రశ్నించారు. సుప్రీం కోర్టులో కేసు విత్ డ్రా చేసుకుంటేనే ట్రిబ్యునళ్ల ఏర్పాటు సాధ్యమని కేంద్రం చెబితే... నిన్న,మొన్నటిదాకా కావాలనే జాప్యం చేశారని ఆరోపించారు.
Recommended Video
తప్పయితే డ్యామ్లో దూకుతా : బండి సంజయ్
కృష్ణా జలాల విషయంలో తాను చెబుతున్న మాటలు అవాస్తవమైతే శ్రీశైలం డ్యామ్లో దూకి చనిపోతానని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ముఖ్యమంత్రిది తప్పయితే ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. పొర్లు దండాలు పెడుతూ తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలన్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే జల వివాదం పేరుతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డ్రామాకు తెరలేపారని అన్నారు. అందుకే ప్రాజెక్టుల వద్ద భారీగా పోలీసులను మోహరిస్తున్నారని చెప్పారు. అతి త్వరలోనే ఇరువురు పోలీసులు కొట్టుకునే పరిస్థితి వస్తుందన్నారు. ప్రజల్లో సెంటిమెంటును రెచ్చగొట్టేందుకే ఇరు రాష్ట్రాల సీఎంలు ఇలా చేస్తున్నారని ఆరోపించారు.