కేసీఆర్కు భయం పట్టుకుందా: ఆ ప్రకటన రాజకీయ వ్యూహమా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రైతులకు ఎవరూ ఊహించని వరం ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఈ మేరకు ఎకరాకు రూ.4000 నేరుగా రైతుల అకౌంట్లలోనే వేస్తామని చెప్పారు.
రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులు ఉన్నారని, వారందరికీ దీని ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. అయితే, కేసీఆర్ ఇచ్చిన ఈ వరం వెనుక పెద్ద రాజకీయ చతురత ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇది ఒక అస్త్రంగా భావిస్తున్నారు.
తెరాస పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఇలాగే ఉంటే 2019 ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతామోననే భయం కేసీఆర్, తెరాసలో ఉందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అందుకే ఆయన ఎన్నికలకు ముందు ప్రజలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే, రైతుల కోసం తపన పడుతున్న కేసీఆర్పై విమర్శలు సరికాదని తెరాస అంటోంది.
రైతు సంఘం వెనుక..
కేసీఆర్ ఎరువులు ఉచితంగా ఇవ్వడంతో పాటు.. రైతులకు మరో విషయం కూడా చెప్పారు. ప్రతి గ్రామంలో రైతులందరూ కలిసి రైతు సంఘంగా ఏర్పడాలని, అందరు అందులో పేరు నమోదు చేసుకోవాలని చెప్పారు.
ప్రతి గ్రామంలో ఏర్పడే రైతు సంఘాల వల్ల వచ్చే ఎన్నికల్లో తెరాసకు లబ్ధి చేకూరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారిని అధికార పార్టీ వైపు మోటివేట్ చేయడం కూడా సులభమవుతుందని అంటున్నారు.
ఎలక్షన్ జిమ్మిక్ అన్న విపక్షాలు
రైతులకు ఉచిత ఎరువులు ఎలక్షన్ జిమ్మిక్ అని విపక్షాలు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో తెరాస 119 స్థానాలకు గాను 63 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత ఇరవై అయిదు మందికి పైగా ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి తెరాసలో చేరారు. దీంతో ఇప్పుడు ఆ పార్టీ బలం 90కి చేరింది.
తెరాస డిఫెన్స్లో ఉందా?
2019 ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని తెరాస నేతలు చెబుతున్నారు. అయితే పరిస్థితులు చూస్తుంటే మాత్రం అలా కనిపించడం లేదంటున్నారు. కేసీఆర్ కేవలం మాటలు చెప్పి మభ్య పెడుతున్నారు తప్ప, చేసిందేమీ లేదని విపక్షాలు, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం వంటి వారు విమర్శిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఉద్దేశ్యమే నీళ్లు, ఉద్యోగాలు, స్వపరిపాలన. పాలన పేరుకే మనది అని, కానీ సమైక్య పాలనకు ఏమాత్రం తీసిపోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని చెబుతున్నారు.
సమైక్య పాలనకు తేడా లేదని విపక్షాల విమమర్శలు
సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలను ఎలాగైతే అణగదొక్కారో స్వపరిపాలనలోను అలాగే ఉందని అంటున్నారు. ధర్నా చౌక్ తీసివేయడం, సమస్యలపై ఆందోళనలు, ధర్నాలు చేసే వారిని హెచ్చరించడం వంటివి ఉన్నాయని అంటున్నారు.
ఇలా విపక్షాల ఆరోపణలు, కోదండరాం వంటి నిలదీత నేపథ్యంలో తెరాస డిఫెన్స్లో పడిందని అంటున్నారు. అంతేకాదు, క్షేత్రస్థాయిలో కేసీఆర్ పాలనపై అంత సానుకూలంగా ఏమీ లేదని తెరాస గుర్తించిందని అంటున్నారు. ఈ కారణంగానే ప్రజలను మచ్చిక చేసుకోవాలని భావిస్తోందని, ఇందులో భాగంగా రైతులకు ఉచిత ఎరువులు ఎరవేసిందంటున్నారు.
కేసీఆర్ ఇచ్చిన హామీల మాటేమిటి?
2014 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ వాటిలో ఎన్నింటిని నెరవేర్చారని విపక్షాలు నిలదీస్తున్నాయి. తెరాస అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానని చెప్పారని, కానీ కేసీఆరే పీఠం ఎక్కారని, దళితులకు మూడు ఎకరాలు ఇస్తానని చెప్పారని, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవన్నీ పైపైన మాత్రమే కనిపిస్తున్నాయని అంటున్నారు.
మొత్తానికి తెరాసకు ప్రజల్లో ఆదరణ బాగా తగ్గిందని, దానిని కప్పి పుచ్చుకొని, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్.. ఎన్నికలకు మరో రెండేళ్లు ఉన్న సమయంలో రైతులకు ఉచిత ఎరువులు, రైతు సంఘాలు, రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారంటున్నారు.
మతపరమైన రిజర్వేషన్లకు అంగీకరించరని తెలిసి, కేంద్రం దీనిని ఒప్పుకోదని తెలిసి కూడా కేసీఆర్ వ్యూహాత్మకంగా దీనిని ఇప్పుడు తెరపైకి తీసుకు వచ్చారని అంటున్నారు. కేసీఆర్ పాలనపై కోర్టులు పలుమార్లు మొట్టికాయలు కూడా ఇచ్చాయి. ఇప్పుడు కొన్నింటిని తెరపైకి తెచ్చి 2019లో లబ్ధి పొందాలని కేసీఆర్ చూస్తున్నారని అంటున్నారు.