అందరూ 'కాంగ్రెస్' అంటున్నారు? ఏం చేద్దాం భాయ్?
మొత్తానికి చాలారోజుల నుంచి అదిగో జాతీయ పార్టీ.. ఇదిగో జాతీయపార్టీ అంటూ ఊరిస్తూ వస్తోన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టతనిచ్చారు. విజయ దశమిరోజు మధ్యాహ్నం ఆయన పార్టీ పేరు ప్రకటించబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలతో జరిగిన విస్త్రతస్థాయి సమావేశంలో పలు అంశాలను తెలియజేశారు. జాతీయ పార్టీ కాబట్టి జాతీయస్థాయిలో జాతీయ పార్టీలతో పోటీపడాల్సి ఉంటుంది. కానీ వేరే ఏ జాతీయ పార్టీలతోను తమకు పోటీ లేదని, తమ పార్టీ ఒక్క భారతీయ జనతాపార్టీతోనే పోటీపడబోతుందని తేల్చేశారు.

పెద్దన్నగా కాంగ్రెస్ పార్టీ ఉండాలి!
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో కూటమి ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అవన్నీ కొలిక్కి రాకపోవడంతోపాటు జాతీయపార్టీ ఉంటేనే బీజేపీని అధికారం నుంచి దించడానికి వీలవుతుందని భావించారు. ఆ కోణంలోనే ఆయన తన ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఉంది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ లేకుండా ఇతర పార్టీలు ముందుకు రావడంలేదు. పెద్దన్నగా కాంగ్రెస్ పార్టీ ఉండాలనేది వారి అభిప్రాయం. ఇతర పార్టీల నేతలందరిదీ ఇదే అభిప్రాయంగా ఉంది. ఈ విషయంలో కేసీఆర్ ముందుకు, వెనక్కు ఊగిసలాడుతున్నారు. ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న పార్టీతో జాతీయస్థాయిలో చెలిమిచేస్తే రాష్ట్రంలోని పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలను పంపించినట్లవుతుందని భావిస్తున్నారు.

మమతాబెనర్జీ కూడా కాంగ్రెస్ తో చెలిమికి సిద్ధమయ్యారు!
కేసీఆర్ ప్రధాన ఉద్దేశం.. రాబోయే ఎన్నికల్లో నరేంద్రమోడీ, అమిత్ షాను అధికారానికి దూరం చేయడమే. అది చేయాలంటే జాతీయస్థాయిలో రాజకీయాలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ లేకుండా జాతీయస్థాయి రాజకీయాలు చేయడం కుదరదని కేసీఆర్ కు అనుభవమైంది. వాస్తవానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ లేకుండానే ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ పార్టీ లేకుండా జాతీయస్థాయిలో రాజకీయాలు చేయడం కుదరదని గమనించారు. దీంతో ఇష్టం లేకపోయినా ఆ పార్టీతో కలిసి నవడానికే సిద్ధమయ్యారు.

కొద్దిరోజులు ఒంటరి పోరాటం చేద్దాం!
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత కుమారస్వామి హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను కలిసివెళ్లారు. కూటమిని ఏర్పాటు చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా డీఎంకే, ఆప్, జేడీయూ, టీఎంసీ, ఎన్ సీపీ, ఆర్ జేడీ, ఎస్పీ తదితర పార్టీ నేతలందరితో చర్చించారు. అందరూ కాంగ్రెస్ పార్టీ ఉండాలని కేసీఆర్ తో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా జాతీయ రాజకీయాలు చేయాలంటే ఆ పార్టీతో సానుకూలంగా ఉండే పార్టీలేవీ కలిసిరావు. కాబట్టి కేసీఆర్ కొద్దిరోజులు ఒంటరి పోరాటానికే సిద్ధమయ్యారు. బీజేపీని ఒంటరిగానే ఎదుర్కొని, అప్పుడు జరిగే రాజకీయ పరిణామాలనుబట్టి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications