రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయించారు..! కేంద్ర బడ్జెట్ తో సమన్యాయం ఖాయమన్న నేతలు..!!
హైదరాబాద్: గులాబీ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపి నేతలు మరోసారి మండిపడ్డారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకే దక్కుతుందని రాష్ట్ర బీజేపి నేతలు ఘాటు విమర్శలు చేసారు. రాష్ట్ర ప్రయోజనాలను కాదని చంద్రశేఖర్ రావు సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ఆ రోపించారు. సామాన్య ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రబడ్జెట్ ప్రవేశపెడితే దాని పైన గులాబీ పార్టీ విమర్శలు చేయడం దారుణమన్నారు బీజేపి నేతలు.
తెలంగాణ ను అప్పుల పాలు చేసిన కేసీఆర్..! జాగీరులా ప్రజాధనం కేటాయింపన్న బీజేపి..!!
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఆస్తులు సమకూర్చుకొని, పెరిగిన ఆదాయాన్ని ప్రజలకు పంచుతుంటే, రాష్ట్రంలోని చంద్రశేఖర్ రావు ప్రభుత్వం మాత్రం ఉచితాల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఉన్న ఆస్తులు అమ్మడం, భారీగా అప్పులు చేయడం ద్వారా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. శుక్రవారం మెదక్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, లోక్జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాప్ పటేల్, నిర్మాత అల్లు అరవింద్ అల్లు అరవింద్ సమీప బంధువు, పలువురు ప్రవాస భారతీయులు బీజేపీలో చేరారు.
Recommended Video
కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకం..!నూతన భారతావనిని ప్రతిబింబిస్తుందన్న రాష్ట్ర నేతలు..!!
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని గతంలో పాలించిన 16 మంది ముఖ్యమంత్రులు 69 వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తే.. మహానుభావుడు, మహాప్రభు, చక్రవర్తి, 1.2 లక్షల కోట్ల రూపాయలను అప్పు చేశారని సీఎం చంద్రశేఖర్ రావు పై లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఆస్తులు పెంచకుండా పంచుకుంటూ పోతే పంచె కూడా మిగలదని హెచ్చరించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ సమస్యను పట్టించుకోని కేసీఆర్ కొత్త సచివాలయం, అసెంబ్లీ కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని సొంత జాగీరులా వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. మరో నిజాం నవాబులా తన పేరు చరిత్రలో నిలిచిపోవాలని చంద్రశేఖర్ రావు చూస్తున్నారే తప్ప.. కొత్త సచివాలయం, అసెంబ్లీతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండబోదని స్పష్టం చేశారు.
అన్ని వర్గాలకు ప్రయోజనం..! మోదీ విజన్ ఉన్న నేతగా అభివర్ణన..!!
స్వచ్ఛభారత్ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా 5.6 లక్షల గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారని, సీఎం చంద్రశేఖర్ రావు కు సోయి లేకపోవడంతో రాష్ట్రంలో ఈ పథకం అమలు కాలేదన్నారు. చారిత్రాత్మకమైన కేంద్ర బడ్జెట్ 130 కోట్ల దేశ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని లక్ష్మణ్ అభివర్ణించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల పురోగతికి దోహదపడుతుందన్నారు. కాగా, బడ్జెట్ నూతన భారతావనిని ప్రతిబింబించేలా ఉందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ సంక్షేమ బడ్జెట్ నూతన పంథాలో ఉందన్నారు. బడ్జెట్ కేటాయింపులు అన్ని వర్గాలకు ప్రయోజనాలు లభించేలా ఉన్నాయని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
సమన్యాయం చేసే బడ్జెట్..! కామెంట్ చేసే అర్హత టీఆర్ఎస్ కు లేదన్న బీజేపి..!!
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినది సమ్మిళిత బడ్జెట్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. అన్ని రంగాల అభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రణాళికలు ఉన్నాయన్నారు. రాష్ట్రాలకు 13 లక్షల కోట్లు రూపాయల అందించడం ద్వారా ఫెడరల్ వ్యవస్థను మరింత బలోపేతం చేశారని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలోని కొందరు నాయకులు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.