'ప్రతిపక్షాలకు హోర్డింగ్లు లేకుండా బెదిరింపు', 'కెసిఆర్లాంటోళ్లు కాంగ్రెస్లో 20మంది'
హైదరాబాద్: భాగ్యనగరంలో ప్రతిపక్షాలకు హోర్డింగులు ఇవ్వకుండా ప్రభుత్వం బెదిరిస్తోందని, గెలుస్తామనే నమ్మకం లేకనే ఓట్లు తొలగించడం, డివిజన్లను 200కు పెంచాలని ప్రయత్నించడం, బిసి ఓటర్లను గుర్తించడంలో అనేక అవకతవకలకు పాల్పడుతోందని బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి అధికార పార్టీపై ఆరోపించారు.
ఆయన పార్టీ కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు ఫిరాయింపుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టిఆర్ఎస్ కుయుక్తులు పన్నుతోందన్నారు.
జిహెచ్ఎంసీ పరిధిలో కేవలం రెండు సెగ్మెంట్లలోనే గెలిచిన టిఆర్ఎస్ ఇప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. నగరంలో ప్రతిపక్షాలకు హోర్డింగులకు ఇవ్వకుండా బెదిరిస్తోందన్నారు. అన్నీ వారివే పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.
నగరంలో గుంతలు లేని రోడ్లు చూపిస్తే తాను రూ.లక్ష రూపాయలు ఇస్తానని కిషన్ రెడ్డి సవాల్ చేశారు. శంకుస్థాపనలలో ప్రోటోకోల్ పాటించడం లేదన్నారు. సంబంధం లేకున్నా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేరు పైన ఉంటోందన్నారు. టిఆర్ఎస్ తీరును జాతీయ నేతలకు వివరిస్తామన్నారు.
కేసీఆర్ లాంటోళ్లు 20 మంది: పొంగులేటి
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లాంటి వాళ్లు, ఆయనను మించిన వాళ్లు తదమ పార్టీలో ఇరవై మంది వరకు ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మంగళవారం అన్నారు.
తాము తలచుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుందని హెచ్చరించారు. గత ఎన్నికల్లో తమ పార్టీలోని నేతల మధ్య సమన్వయం లేకనే ఓడిపోయాం తప్ప సత్తా లేక కాదన్నారు. క్యాంపు రాజకీయాలకు, అధికార దుర్వినియోగానికి టీఆర్ఎస్ కేరాఫ్ అడ్రస్గా మారిందన్నారు.