యాదాద్రీశునికి కేసీఆర్ దంపతుల తొలిపూజలు; స్వయంభు లక్ష్మీనరసింహుని దర్శించుకున్న తొలి భక్తుడు ఆయనే!!
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాకుండా, దేశవిదేశాలలో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నవ వైకుంఠాన్ని నిర్మింపజేశారు. విశేషమైన నిర్మాణాలతో, అద్భుతమైన శిల్ప కళా ఖండాలతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా 1200 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని పునర్ నిర్మింపజేశారు కేసీఆర్. లక్ష్మీ నరసింహుడి పట్ల అత్యంత భక్తి భావం ప్రదర్శించిన కెసిఆర్ యాదాద్రి క్షేత్రాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దారు.

సప్త గోపురాలతో సప్తగిరుల లాగా శోభాయమానంగా యాదాద్రి
యాదాద్రి ఆలయ నిర్మాణం, ఆలయ గోపుర సౌందర్యం ఇంతింత అని వర్ణించడానికి వీలుకాదు. ఆలయానికి నాలుగు దిశలలో నాలుగు యాభై ఐదు అడుగుల ఎత్తున పంచ తన గాలిగోపురాలు నిర్మాణం చేశారు. గతంలో రెండే రెండు గోపురాలతో వున్న పాత దేవాలయాన్ని నేడు నలువైపుల శాస్త్రోక్తంగా 7 గోపురాలతో నిర్మించి, అద్భుతమైన శిల్ప కళా ఖండాలతో తీర్చిదిద్దారు. మొత్తం సప్త గోపురాలతో సప్తగిరుల లాగా యాదాద్రి ఆలయం శోభాయమానంగా కనిపిస్తుంది. ఎనిమిది వందల మంది శిల్పులు ఈ ఆలయ నిర్మాణానికి విశేషంగా కృషి చేశారు.
యాదాద్రి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు
ఆలయ ప్రాకారాల కుడ్యాలపై, స్తంభాలపై రామాయణ, మహాభారత ఇతిహాసాలకు సంబంధించిన అనేక దృశ్యాలు అద్భుతంగా మలచబడ్డాయి. ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పునఃప్రారంభ ఘట్టం అంతే అద్భుతంగా కొనసాగింది.
యాదాద్రిలో ఆలయ ఉద్ఘాటన ప్రక్రియ అంగరంగవైభవంగా జరిగింది. ఉద్ఘాటన లో భాగంగా కీలకమైన మహాకుంభ సంరక్షణ నేత్రపర్వంగా కొనసాగింది. తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత భక్తిభావంతో ఈ మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిధున లగ్నంలో ఏకాదశి సందర్భంగా 11 గంటల 55 నిమిషాలకు ఈ మహోత్సవం ఆవిష్కృతమైంది.
మహా కుంభ సంప్రోక్షణ నిర్వహించి తొలిపూజలు చేసిన కేసీఆర్ దంపతులు
దీనిలో భాగంగా శ్రీ సుదర్శన చక్రానికి యాగజలాలతో సంప్రోక్షణ నిర్వహించారు కెసిఆర్ . దీనితోపాటు ప్రధానాలయం గోపురాలపై కలశాలకు కుంభాభిషేకం నిర్వహించారు. ఏడు గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ చేశారు. ఆలయ రాజగోపురం పై ఉన్న స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ జరిగింది. ఈ ఉద్ఘాటన అనంతరం 12 గంటల 20 నిమిషాల తరువాత గర్భాలయంలో మూలవిరాట్ దర్శనం నిర్వహించి, స్వయంభూ అయిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి సీఎం కేసీఆర్ దంపతులు తొలి పూజలు చేశారు.

స్వామి దివ్య దర్శనం చేసుకున్న తొలి భక్తుడు కేసీఆర్..
స్వామి వారి పూజా కార్యక్రమాల మహా క్రతువులో పాల్గొన్న కెసిఆర్ దంపతులు లక్ష్మీ నరసింహ స్వామికి తొలి పూజ చేశారు. ఆలయ పూజారులు కెసిఆర్ దంపతులకు ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. యాదాద్రి నరసింహుని దివ్య దర్శనం చేసుకున్న కేసీఆర్ కొండ కింద యాగ స్థలంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి భోజనం చేసిన తర్వాత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. కెసిఆర్ దంపతుల ప్రత్యేక పూజల నేపథ్యంలో తొలి భక్తుడిగా కెసిఆర్ స్వామి వారిని దర్శనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం మూడు గంటల నుండి యాదాద్రి ఆలయంలో భక్తులకు స్వామివారి దర్శనం కానుంది.

యాదాద్రి ఆలయంలో స్వామి వారి దర్శనానికి వేచి చూస్తున్న భక్తులకు
ఇక యాదాద్రి ఆలయ పునఃప్రారంభం మహోత్సవ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు యాదాద్రి ఆలయ పునః ప్రారంభోత్సవానికి రావటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులకు దర్శనాలను నిలిపివేసిన అధికారులు సీఎం కేసీఆర్ వెళ్ళిన అనంతరం సాధారణ భక్తులకు దర్శనాలను కొనసాగిస్తారు. స్వామి దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్నారు.












Click it and Unblock the Notifications