పాఠంగా కేసీఆర్ దీక్ష!, సిలబస్ రివ్యూ కమిటీ నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బోధించే పాఠ్యాంశాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన దీక్షను పాఠ్యాంశంగా చేర్చాలని భావిస్తున్నారు. ఆయన దీక్ష అనంతరం 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటుపై చేసిన ప్రకటనను కూడా చోటు కల్పించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సిలబస్ రివ్యూ కమిటీ నిర్ణయం తీసుకుంది.
దీంతో పాటు హైదరాబాద్ విముక్తి ఉద్యమాలు, 1947 స్వాతంత్య్ర పూర్వ హైదరాబాద్ సంస్థానం పరిస్థితిని ప్రతిబింబించే పాఠాలను, 1956 ముందు భాగంగా వర్గీకరించారు. నిజాం నవాబుల పాలన, హైదరాబాద్ కేంద్రంగా జరిపిన అభివృద్ధి, సంక్షేమం, రాచరిక పాలనపై తిరుగుబాట్లు, భాషా సంబంధ ఘర్షణలను చేర్చారు.
అందులో భాగంగా ఆంధ్ర జనసభ ఏర్పాటు, గ్రంథాలయోద్యమం, హైదరాబాద్లో క్విట్ ఇండియా ఉద్యమం, మాడపాటి హనుమంతరావు తదితరులు చేసిన పోరాటాల గురించి ఇక్కడ చర్చించనున్నారు. నిజాం పాలన అంతమయ్యే సమంయలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని విపులంగానే పాఠ్యాంశాల్లో చేర్చనున్నారు.

ఈ ఉద్యమంలో ప్రముఖులైన రావి నారాయణ రెడ్డి, చాకలి ఐలమ్మ, మఖ్దూం మొహియుద్దీన్, బందగీ, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, దొడ్డి కొమరయ్యల జీవిత చరిత్రలు, రజాకార్ల మతపరమైన దాడులు, వారికి వ్యతిరేకంగా కమలమ్మ ఆధ్వర్యంలో మహిళా గెరిల్లా స్క్వాడ్స్ ఏర్పాటు, హైదరాబాద్పై పోలీసు చర్య, విలీనం వంటి ఉద్యమ ఘట్టాలకు చోటు లభించింది.
1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచీ, ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు వరుసగా చేస్తూ వచ్చిన పోరాటాలు, ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటును పొందుపరిచారు. ఈ పాఠ్యాంశాల్లో 2001లో టీఆర్ఎస్ ఏర్పడటానికి ముందు, ఆ తరువాత పరిణామాలను వేర్వేరు దశలుగా అందించారు.
తొలి దశలో.. పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ ఉద్యమం, 1969 ఉద్యమం, 1972 జై ఆంధ్రా ఉద్యమం, 1990లో ఆర్థిక విధానాలపై పోరాటాలు, 1 నవంబర్ 1996 తెలంగాణ విద్రోహ సభ, 1997లో తెలంగాణ జనసభ ఏర్పాటు తదితర అంశాలను చర్చిస్తారు. రెండో దశలో టీఆర్ఎస్ ఏర్పాటు, అనంతర పోరాటాలపై దాని ప్రభావం, పోరాట రూపాలు, కేసీఆర్ దీక్ష, కేంద్రం ప్రకటన, జేఏసీల ఏర్పాటు, తెలంగాణ ఏర్పాటు వంటి కీలక ఘట్టాలను చేర్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications