అవన్నీ అవాస్తవాలే, అమిత్ షా క్షమాపణ చెప్పాలి, రాజీనామాకు నేను సిద్దమే: కెసిఆర్
బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిప్పులు చెరిగారు. ఎవరి ప్రయోజనాలకోసం అమిత్ షా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్:బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిప్పులు చెరిగారు. ఎవరి ప్రయోజనాలకోసం అమిత్ షా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రం ఇచ్చే నిధుల ద్వారానే కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని కెసిఆర్ చెప్పారు.తాను లేవనెత్తిన ఈ అంశాలను అమిత్ షా బిజెపి నేతలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవాలనీ రుజువు చేస్తే రాజీనామాకు సిద్దమని కెసిఆర్ ప్రకటించారు. అమిత్ షా చెప్పినవి వాస్తవాలనీ నిరూపిస్తారా అని సవాల్ విసిరారు
మూడు రోజుల పాటు నల్గొండ జిల్లా పర్యటనలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అనేక అవాస్తవాలను ప్రచారం చేశాడని ఆయన దుయ్యబట్టారు. ఈ విషయమై తాను మౌనంగా ఉంటే అమిత్ షా చెప్పిన మాటలన్నీ వాస్తవాలు అని నమ్మేపరిస్థితి ఉంటుందని చెప్పారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పారు. కేంద్రం దయదక్షిణ్యాలమీద బతకడం లేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి మోడీ సహా, కేంద్ర మంత్రులు, ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రశంసిస్తున్నారని ఈ విషయాన్ని గమనంలోకి పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. కేంద్రం నుండి లక్షకోట్లకుపైగా నిధులు ఇచ్చామని తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇండస్ట్రీయల్ పాలసీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలను పలువురు ప్రశంసించాయని ఆయన చెప్పారు.
అమిత్ షా ఏంక్షమాపణ చెప్పాలి?
బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కెసిఆర్ ఫైర్ అయ్యారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తమ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. సంక్షేమ పథకాల కోసం సుమారు 35 వేల కోట్లను ఖర్చుచేస్తున్నట్టు చెప్పారు.కేంద్ర ప్రభుత్వాలకు తక్కువగా నిధులు ఇస్తున్నాయి. అంతేకాదు రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడ ఇవ్వలేదు.తప్పుడు ప్రచారం చేసినందుకుగాను అమిత్ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రజలను కించపర్చేవిధంగా మాట్లాడారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రగతిని దెబ్బకొట్టేలా మాట్లాడారు. చాలమంది అమిత్ షాలను చూశానన్నారు కెసిఆర్.
రాజీనామాకు సిద్దం
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయమై తెలంగాణ నుండి కేంద్రానికి వెళ్ళిన నిధుల విషయమై తాను చెప్పిన లెక్కలు వాస్తవంం కాకపోతే తాను రాజీనామా చేసేందుకు సిద్దమేనని కెసిఆర్ ప్రకటించారు. దేశంలోని గుజరాత్, తెలంగాణ, మహరాష్ట్ర,కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాల తరహాలోనే తమ ప్రభుత్వం కూడ అధిక ఆదాయం కలిగిన ఉన్న రాష్ట్రమని చెప్పారు. దేశానికి తెలంగాణ ప్రభుత్వం నుండి 2016-17 లో 32,186 కోట్ల ఆదాయం అందిందన్నారు. 7671 కోట్లు సర్వీస్ రంగం నుండి,. 3,328 కోట్లు కస్టమ్స్ ద్వారా, సెంట్రల్ ఎక్సైజ్ శాఖ ద్వారా 6828 కోట్లు అందించినట్టు చెప్పారు.2016-17 లో 24,562 కోట్లు కేంద్రం నుండి వచ్చాయని చెప్పారు. కేంద్రానికి తెలంగాణ నుండి వచ్చిన ఆదాయం కంటే సగం కూడ నిధులు రాలేదు.లక్ష కోట్లకు పైగా నిధులను ఇచ్చినట్టు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
తెలంగాణను అవమానించిన చరిత్ర బిజెపిదే
తెలంగాణకు అవమానించిన చరిత్ర బిజెపికి ఉందన్నారు. 1998 లో కేంద్ర హోంమంత్రిగా ఉన్న అద్వానీ తెలంగాణను అవమానపర్చారని చెప్పారు. హైద్రాబాద్ తెలంగాణలోనే ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని అద్వానీ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. మరో వైపు హైకోర్టు ఏర్పాటు అంశంపై అమిత్ షా కూడ ఇదే తరహాలో మాట్లాడారని చెప్పారు.హైద్రాబాద్ లోనే హైకోర్టులో ఉందని అమిత్ షా మాట్లాడుతూ వెకిలిగా మాట్లాడారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కలిసి తెలంగాణను విఫలప్రయోగంగా మార్చేందుకు ప్రయత్నం చేశారని ఆయన ఆరోపణలు చేశారు.
దళితుల ఇండ్లలో సహపంక్తి భోజనాన్ని హస్యాస్పదం చేశారు
దళితుల ఇండ్లలో సహపంక్తి భోజనాన్ని హస్యాస్పదం చేశారని కెసిఆర్ విమర్శలు గుప్పించారు.అంతేకాదు చండూరు మండలంలోని తేరటుపల్లిలో దళితుల ఇళ్ళలో వండిన భోజనాన్ని అమిత్ షా తినలేదన్నారు కెసిఆర్ తేరట్ పల్లి గ్రామంలో బిజెపి నాయకుడు మనోహార్ రెడ్డి వండిన భోజనాన్ని తేరట్ పల్లికి తీసుకువచ్చారన్నారు.అయితే తేరట్ పల్లిలో దళితులు నిరసన వ్యక్తం చేశారని చెప్పారు.మరో వైపు పెద్దదేవులపల్లికి నిర్వహించిన సహపంక్తి భోజనానికి నల్గొండ నుండి అన్నపూర్ణ మెస్ నుండి బోజనం వెళ్ళిందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రపతి ఎన్నికలపై నిర్ణయం తీసుకోలేదు
రాష్ట్రపతి ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అంతేకాదు ఈ నెల 27, తమ పార్టీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఉంది.ఈ సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికల విషయమై నిర్ణయం తీసుకొంటామన్నారు. అంతేకాదు మోడీ తీసుకొనే మంచి కార్యక్రమాలను తాము సపోర్ట్ చేస్తామన్నారు.అయితే అమిత్ షా గతంలో వచ్చిన సమయంలో తాము మాట్లాడలేదన్నారు. కానీ, తమపై తప్పుడు ప్రచారం చేయడంతోనే తాను నోరు మెదపాల్సి వచ్చిందన్నారు. తెలంగాణకు వ్యతిరేకించేవారు ఎవరైనా క్షమించే ప్రసక్తేలేదన్నారు.