శతాబ్దం తర్వాత హైదరాబాదులో ఈ వర్షం: అతి చేస్తున్నారంటూ కెసిఆర్ ఆగ్రహం
హైదరాబాద్: హైదరాబాదులో భిన్నమైన పరిస్థితి ఉందని చెప్పారు. 468 మిల్లిమీటర్ల వర్షపాతం కురిసిందని చెప్పారు. 1902 తర్వాత ఇంత వర్షం ఇదే మొదలు అని ఆయన అన్నారు. దీనివల్ల హైదరాబాదులో కొంత అసాధారణ పరిస్థితి నెలకొందని చెప్పారు. హైదరాబాదులో పూర్తిగా పరిస్థితి చేయిదాటిపోయిన పరిస్థితి లేదని అన్నారు. నష్టాన్ని, పరిస్థితిని ఎక్కువ చేసి చూపుతున్నారని, అది సరి కాదని ఆయన అన్నారు. ప్రజలను భయాందోళనలకు గురి చేయవద్దని చెప్పారు.
హైదరాబాదులో మనుషులే కాదు, జంతువులు కూడా చనిపోలేదని అన్నారు. చెన్నైలాంటి పరిస్థితి రాలేదని, అందుకు అదృష్టవంతులమని, ఎవరికీ ఏమీ కాదని అన్నారు. జిహెచ్ఎంసి కొన్ని పాత భవనాలను కూల్చివేశారని, దానివల్ల ప్రమాదాలు తప్పాయని ఆయన చెప్పారు. రాంగోపాల్ పేట పోలీసు స్టషన్ ఖాళీ చేయిస్తామని చెప్పారు.
హైదరాబాదులో ఈ సమస్య కొత్తది కాదని, వర్షాలు పడకముందే తెలిసిన సమస్య అని, ఈ సమస్య వస్తుందని ముందే చెప్పానని ఆయన అన్నారు. విశ్వనగరం తెల్లారిపూటనే కాదని, కొంత కాలం పడుతుందని ఆయన అన్నారు. హైదరాబాదులో 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని ఆయన చెప్పారు. గత ప్రభుత్వాల కాలంలో తెలివి తక్కువ తనం వల్ల కట్టిన ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. దీనికి 11 వేల కోట్ల రూపాయల వ్యయమవుతుందని ఆయన చెప్పారు.
తాము వచ్చి 2 ఏళ్ల 4 నెలలు అయిందని, అంతా చేయడానికి సమయం పడుతుందని ఆయన అన్నారు. 24 వేల కోట్ల రూపాయల రుణం హైదరాబాదుకు అవసరం ఉందని ఆయన అన్నారు. బాధ్యత లేకుండా ఎన్నయినా మాట్లాడవచ్చునని ఆయన చెప్పారు.
హైదరాబాదులో చెడిపోయిన రోడ్లు చాలా తక్కువ అని ఆయన చెప్పారు. ఎంత మేరకు చెడిపోయిందో ఆయన లెక్క చెప్పారు. 90 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రోడ్లు ఉన్నాయని, వీటిలో పది శాతం మాత్రమే ధ్వంసమయ్యాయని ఆయన అన్నారు. కొంత మంది ఎక్కువ చేసి చూపుతున్నారని ఆయన అన్నారు. ప్రజలను భయాందోళనలకు గురి చేయవద్దని ఆయన అన్నారు. అబద్ధాలు చెప్పడానికి, దాచిపెట్టడానికి తాము సిద్ధంగా లేమని ఆయన అన్నారు.
అమెరికాలో టార్పడో వస్తుంది, తాను చూశానని, ప్రకృతి మానవ శక్తికి మించి విజృంబిస్తే ఏం చేస్తామని ఆయన అన్నారు. హైదరాబాదులో అక్రమ కట్టడాలు నిర్మిస్తే కూల్చివేస్తామని ఆయన చెప్పారు. రాజకీయ నేతలవైనా ఎవరివైనా నిర్దాక్షిణ్యంగా కూల్చి వేస్తామని ఆయన చెప్పారు. కూల్చివేసినప్పుడు ప్రభుత్వాన్ని సమర్థించాలని ఆయన అన్నారు.
అంతర్జాతీయ వాతావరణ సంస్థలన్నీ పరిస్థితి మారి, వచ్చే ఏడాది కూడా మంచి వర్షాలు వస్తాయని చెబుతున్నాయని ఆయన చెప్పారు. కొంత జాగ్రత్తగా పనిచేసుకుంటే సంతోషంగా ఉంటామని ఆయన చెప్పారు. ఈలోగా ప్రభుత్వం పరిస్థితిని బాగు చేసుకోవాలని ఆయన అన్నారు. హైదరాబాదును కళ్లారా చూసిన తర్వాత, వాతావరణ పరిశోధన కార్యాలయాల అంచనాను పరిగణనలోకి తీసుకుని కొద్ది రోజుల్లో అక్రమ కట్టడాలు కూల్చివేస్తామని ఆయన చెప్పారు.
అక్టోబరులో కూడా వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు. తెలంగాణలో వాతావరణం మారిపోయిందని, వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందని, ఎప్పుడూ కురిసే అవకాశం ఉందని ఆయన అన్నారు. దీంతో హైదరాబాదు రోడ్లను బాగు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసికి నిధులు అందిస్తామని ఆయన చెప్పారు. నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారని, కమిటీ అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం కనిపెడుతారని ఆయన అన్నారు. 15 నుంచి 20 వేల కోట్ల రూపాయలకు ప్రభుత్వం జిహెచ్ఎంసికి గ్యారంటీ ఇస్తుందని ఆయన చెప్పారు.
హైదరాబాదులో 390 నాలాలు ఉంటే 183 మాత్రమే మిగిలాయని, మూసిలోకి నీరు పోయే వ్యవస్థను అక్రమ కట్టడాలు ఆపేస్తున్నాయని ఆయన చెప్పారు. కూల్చివేయడానికి ప్రజలు సహకరించాలని, వారందరికీ డబుల్ బెడ్రూంలు ఇస్తామని ఆయన చెప్పారు.
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు 60 ఏళ్లు పాలించాయని, ఆ పార్టీల పాలనలోనే ఈ అక్రమ కట్టడాలు నిర్మించారని, అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆ పార్టీలు సహకరించాలని ఆయన అన్నారు. ఎక్కువ మాట్లాడడం, అతి మాట్లాడడం సరి కాదని అన్నారు. ఈ బాధ హైదరాబాదుకు శాశ్వతంగా పోవాలంటే మీడియా ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు. ఎడారి లాంటి ప్రాంతం మనది కాదని, కొంచెం ఎక్కువైతే ఇబ్బందులు వస్తాయని ఆయన అన్నారు.