పార్లమెంట్ సాక్షిగా కేంద్రంతో సమరమే.. నేడు టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ కీలక భేటీ; వ్యూహమిదే!!
జూలై 18వ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు టిఆర్ఎస్ ఎంపీలతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరగనుంది. పార్లమెంట్ సమావేశాలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశం నిర్వహించి పార్టీ వ్యూహంపై చర్చించనున్నారు. తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్లో పోరాడాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
పార్లమెంట్ సమావేశాలు .. కేంద్రం టార్గెట్ గా కేసీఆర్ వ్యూహాలు
పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్లమెంటులో నిరసనలు తెలియజేయాలని మరియు అనేక కీలక అంశాలను లేవనెత్తాలని మరియు పార్లమెంటు ఉభయసభలలో ఒక పటిష్టమైన వ్యూహాన్ని అనుసరించాలని ఎంపీలకు కెసిఆర్ సూచించనున్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక అడ్డంకులు సృష్టిస్తున్న కేంద్రాన్ని పార్లమెంట్లో ఎండగట్టాలని ఎంపీలకు ముఖ్యమంత్రి చెప్పనున్నట్లు సమాచారం.
రాష్ట్రానికి అన్యాయం చేయడంలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టాలని, ప్రజల ఆకాంక్షలను కూడా ప్రతిబింబించాలని ఎంపీలకు సీఎం చెప్పనున్నారు. వ్యవసాయం, నీటిపారుదల, వ్యవసాయ అనుబంధ రంగాల్లో విప్లవాత్మక విధానాలను ప్రవేశపెట్టి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానాన్ని సాధించిందని, కానీ కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బందులకు గురి చేయడాన్ని పార్లమెంట్ వేదికగా ప్రస్తావించాలని కెసిఆర్ సూచించడం ఉన్నారు.
రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం, తెలంగాణాపై కేంద్ర వివక్షను ఎండగట్టే ఎత్తుగడ
రైతులు, మిల్లర్ల నుంచి వరిధాన్యం కొనుగోలు చేయకుండా, వారిని ఇబ్బందులకు గురిచేస్తూ కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రస్తావించాలని ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణపై కేంద్రప్రభుత్వ ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంతోపాటు సామాజిక తనిఖీ కూడా తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. తెలంగాణకు కేంద్రం అవార్డులు కూడా అందించింది. అయినప్పటికీ గ్రామీణ ఉపాధి హామీ పథకం విషయంలో తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని పార్లమెంటు వేదికగా ఎండగట్టాలని ఎంపీలకు చెప్పనున్నారు.
డాలర్తో పోలిస్తే పడిపోతున్న రూపాయి విలువపై పోరాటం
కేంద్రం కుట్రలను బట్టబయలు చేయాలని, తెలంగాణ ప్రభుత్వం పథకాల అమలులో అవరోధాలు సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టాలని ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న దిక్కుమాలిన ఆర్థిక విధానాలు, రోజురోజుకూ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై ఆర్థిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని రక్షించడం భారతీయ పౌరుల బాధ్యత అని సీఎం కేసీఆర్ చెబుతున్న క్రమంలో ప్రజల దృక్పథాన్ని ప్రతిబింబించేలా, అమెరికా డాలర్తో పోలిస్తే పడిపోతున్న రూపాయి విలువను పెంచాలని, ఉభయ సభల్లో కేంద్రంపై పోరాడాలని తెలంగాణ సిఎం ఎంపీలకు సూచించనున్నారు.
కేంద్ర అప్రజాస్వామిక విధానాలపై కలిసొచ్చే పార్టీల ఎంపీలతో కలిసి సమరం
కేసీఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ పరిపాలన మరియు రాజకీయాలలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అప్రజాస్వామిక, ఆధిపత్య విధానాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలహీనపరిచాయని, ఫలితంగా, మత సహనానికి పర్యాయపదంగా ఉన్న భారతదేశంలో అశాంతి పెరుగుతోందని గత కొంత కాలంగా అధికార బీజేపీ సర్కార్ పై ఎదురుదాడి చేస్తోంది.
ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్న ఇతర పార్టీల ఎంపీలను కూడా టీఆర్ఎస్తో చేర్చుకోవాలని ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ఎంపీలతో చెప్పనున్నారు. నేడు జరగనున్న సమావేశంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాట వ్యూహాన్ని ఖరారు చేయడంతో పాటు, కేంద్రంపై సమరంలో భవిష్యత్తు వ్యూహాన్ని కూడా ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు కెసిఆర్.