ఖమ్మం అల్లర్లు ఉద్యమం కాదు, కుట్రే: బీఏసీలో కేసీఆర్ ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ బీఏసీ సమావేశం వాడీవేడిగా సాగింది. మిర్చి రైతుల సమస్యలపై తాము శాసనసభలో ఆందోళన చేపడతామని కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల సమస్యలపై సభలో చేర్చించాల్సిందేనని అన్నారు. చర్చ లేకపోతే కనీసం ప్రకటన చేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు.
కాగా, ఖమ్మం మిర్చి యార్డులో రైతుల ఆందోళన, విధ్వంసంపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఖమ్మంలో జరిగిన అల్లర్లు ఉద్యమం కాదని తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీలు పథకం ప్రకారమే అల్లర్లు చేయించాయని మండిపడ్డారు. ఈ ఆందోళనను రాజకీయ పార్టీలు వెనకుండి నడిపించాయని ఆరోపించారు.

కాగా, భూసేకరణ బిల్లులో సవరణలకు మాత్రమే రేపు(ఆదివారం) జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో చర్చించేందుకు బీఏసీ నిర్ణయించింది. సభకు గంట ముందు సభ్యులకు భూసేకరణ సవరణ బిల్లును అందజేయనున్నారు. సభాపతి మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీశ్రావు, జానారెడ్డి, పాషాఖాద్రి హాజరయ్యారు. రేపు ఉదయం 11గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది.
ఇది ఇలా ఉండగా, ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని కేసీఆర్పై ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ సర్కారు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని షబ్బీర్ అలీ ఆరోపించారు. రైతుల పంటలకు మద్దతు ధర అందించాలని, నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని అన్నారు.












Click it and Unblock the Notifications