ఇక ఫెడరల్ ఫ్రంట్పై కేసీఆర్ దృష్టి.. 23 నుంచి జాతీయ స్థాయిలో పర్యటన..!
హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. కలిసివచ్చే పక్షాలను ఏకం చేసే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. అందులోభాగంగా జాతీయ స్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు సీఎం కేసీఆర్.
లోక్సభ ఎన్నికల తర్వాత ఫెడరల్ ఫ్రంట్ పై కేసీఆర్ దృష్టి పెట్టొచ్చని అందరూ భావించారు. అయితే ఆ ఎన్నికలకు ఇంకా సమయముండటంతో దీనిపై సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో అనుకూలమైన పార్టీలను కూడగట్టి బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్న కేసీఆర్.. అందుకనుగుణంగా ఈ ప్రక్రియను వేగవంతం చేసినట్లు అర్థమవుతోంది.

ఫెడరల్ ఫ్రంట్.. కేసీఆర్ స్పీడ్
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కసరత్తు ప్రారంభించారు కేసీఆర్. కలిసివచ్చే పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేలా జాతీయస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక మంత్రివర్గం ఏర్పాటు, వెంటనే పంచాయతీ ఎన్నికలు, దాని వెంబడే లోక్సభ ఎన్నికలు.. ఇలా బిజీ షెడ్యూల్ ఉండే నేపథ్యంలో ఇప్పుడప్పుడే ఆయన ఫెడరల్ ఫ్రంట్ గురించి ఆలోచించరేమో అనే టాక్ నడిచింది. అయితే అనూహ్యంగా కేసీఆర్ జాతీయ స్థాయి పర్యటనకు సిద్ధమవుతున్నారనే వార్త చర్చానీయాంశంగా మారింది.

24న నవీన్ పట్నాయక్ తో భేటీ..!
జాతీయ స్థాయి పర్యటనలో భాగంగా ఈనెల 23న కేసీఆర్ ఢిల్లీకి వెళతారని తెలుస్తోంది. ప్రధాని మోడీతో భేటీ కానున్నట్లు సమాచారం. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయనను మర్యాదపూర్వకంగా కలవనున్నారట. పనిలోపనిగా వారిద్దరి మధ్య దేశ రాజకీయాలపై ఆసక్తికర చర్చ జరగనుందనే వాదన వినిపిస్తోంది. 2019 మే నెలలో జరగనున్న లోక్సభ పార్లమెంట్ ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. అక్కడినుంచి 24న భువనేశ్వర్ వెళ్లి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ కావాలని అనుకుంటున్నారట.

ఫుల్ క్లారిటీ.. కలిసొచ్చేదెవరో?
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఫుల్ క్లారిటీతో ఉన్న కేసీఆర్ అందుకనుగుణంగా పావులు కదుపుతున్నారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన జాతీయ స్థాయి పర్యటనకు శ్రీకారం చుడతారనే వార్తలొచ్చాయి. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో జోష్ మీదున్న కేసీఆర్.. లోక్సభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ బలం చూపించాలని భావిస్తున్నారు. అయితే ఆ ఎన్నికలకు ఐదారునెలల సమయముండటంతో.. ఫెడరల్ ఫ్రంట్ ను మళ్లీ తెరమీదకు తీసుకొచ్చి జాతీయ స్థాయి పర్యటనకు సిద్ధమయినట్లు సమాచారం.
ఇప్పటికిప్పుడు ఆయా పార్టీల నేతలను కలిసేలా కేసీఆర్ డిసైడ్ కావడానికి బలమైన కారణముందనే వాదన వినిపిస్తోంది. కలిసొచ్చే పక్షాల అగ్రనేతల్ని లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ప్రచారానికి పిలవాలనేది ఆయన అంతరంగంగా కనిపిస్తోంది. అందుకే ఇప్పటినుంచే వాళ్లను టచ్ లో పెట్టుకోవాలని భావిస్తున్నారట. అప్పట్లోనే బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల నేతలతో చర్చలు జరిపిన కేసీఆర్.. తాజాగా బిజూ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తో భేటీ కావాలని అనుకుంటున్నారు. మొత్తానికి ఫెడరల్ ఫ్రంట్ స్పీడ్ పెంచిన కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో చక్రం ఎలా తిప్పబోతారో చూడాలి.












Click it and Unblock the Notifications