ఎన్నికల తెల్లారే..: కీలక హామీ ప్రకటించిన కేసీఆర్, భూమేతేనా? అంటూ కాంగ్రెస్పై ఫైర్
నల్గొండ/కరీంనగర్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. ఒకే రోజులో మూడు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచిస్తున్నారు. సోమవారం ఉమ్మడి కరీంనగర్, నల్గొండ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించారు.
మానకొండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోపై సెటైర్లు వేశారు. ధరణిని తీసేసి 'భూమాత' పెడతామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అది భూమాతానా?.. భూమేతనా? అని విమర్శించారు. అధికారంలోకి వస్తే మూడే గంటలు కరెంట్ ఇస్తమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కర్ణాటకలో 20 గంటల కరెంట్ ఇస్తమని నరికారు.. కానీ 3 గంటలే ఇస్తున్నారని మండిపడ్డారు. అందుకే తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు.

ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తరట కాంగ్రెసోళ్లు. వాళ్లు వస్తే వచ్చినాటికి సచ్చినాటికి కానీ. కాంగ్రెస్ మాటలను మీరంతా విమర్శించాలి. ధరణి తీసి బంగాళాఖాతంలో వేసి భూమాత పెడుతరట. అది భూమాతనా.. భూమేతనా..? మళ్లా వీఆర్వోలను తీసుకొస్తాం. 34 కాలమ్స్ పెడుతాం. కౌలుదార్ల కాలం పెడుతాం. అంటే రైతులకు కౌలుదార్లకు జుట్లు జట్లు ముడేస్తర..? ధరణి తీస్తే రైతుబంధు ఎలా వస్తుంది. మళ్లా వీఆర్వోలు, అగ్రికల్చర్ ఆఫీసర్లు సంతకం, సర్టిఫికెట్ తీసుకురా అంటరు. మళ్లీ లంచాలు, దళారీల రాజ్యం, వీఆర్ఎవోల రాజ్యం వస్తది అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాల కిషన్ను గెలిపించాలని కేసీఆర్ కోరారు.
గత పదేళ్ల నుంచి 70 ఏళ్లలో లేనంత శాంతంగా ఉంది తెలంగాణ. ఎవరికి తోచిన పని వారు చేసుకుంటున్నారు. వ్యవసాయ రంగం కుదుటపడ్డది. రైతుల ముఖాలు తెల్లవడ్డాయి. గ్రామాల్లో ఇండ్లు కట్టుకున్నాం. పల్లెల్లో పల్లె దవాఖానాలు, బస్తీల్లో బస్తీ దవాఖానాలు, నియోజకవర్గంలో 100, 200 పడకల దవాఖానాలు, హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నామని అని కేసీఆర్ వివరించారు.
ఎన్నికల తెల్లారే ఆర్టీసీ ఉద్యోగుల రెగ్యూలరైజ్: కేసీఆర్
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఎలక్షన్ తెల్లారే ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని కడియం శ్రీహరికి మద్దతుగా ప్రచారం చేశారు.
ఆర్టీసీ బిడ్డలు ఉన్నారు. వాళ్లది పాపం ఎప్పుడు ఉద్యోగం పోతదో తెల్వదు. ఒక అభద్రతా భావం. ఆర్టీసీ బిల్లు పాస్ చేసినం. అది గవర్నర్ ఆలస్యం చేయడం వల్ల అది కొంత ఆలస్యమైంది. ఎలక్షన్ తెల్లారే ఆర్టీసీ బిడ్డలను రెగ్యులరైజ్ చేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా చేసమని కేసీఆర్ స్పష్టం చేశారు.
మరోవైపు, నల్గొండలో ప్రచారం చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. పండవెట్టి తొక్కేటోళ్లే కావాల్నా ఎమ్మెల్యేలు అని కేసీఆర్ ధ్వజమెత్తారు. నల్గొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని కంచర్ల భూపాల్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
బీఆర్ఎస్ సర్కారు హయాంలో నల్గొండ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రగల్భాలు మీకు తెలుసు. వాళ్ల డబ్బు అహంకారంతోని ఇంతకు ముందే నాకు నకిరేకల్లో చెబుతున్నారు. నకిరేకల్లో మేం గెలిచిన తర్వాత రామన్నపేట నుంచి నకిరేకల్ దాకా అందర్నీ పండవెట్టి తొక్కుతం అని మాట్లాడుతున్నారు కోమటిరెడ్డి అని కేసీఆర్ మండిపడ్డారు.

ఈ పండవెట్టి తొక్కేటోళ్లే కావాల్నా ఎమ్మెల్యేలు..? వీళ్లేనా మనకు కావాల్సింది. భూపాల్ రెడ్డి ఓడినా, గెలిచినా ప్రజల్లో ఉన్న వ్యక్తి. గతంలో కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఆయన. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఆయన హైదరాబాద్ పోయి ఉండలే. నల్గొండ అదే ఇంట్లో ఉన్నడు తప్ప ఇల్లు కూడా మార్చలేదు. ప్రజల మధ్యలో ఉండి, పొద్దున్నే లేస్తే మీ మధ్యలో తిరిగేటోళ్లు కావాల్నా..? గెలిచిన తెల్లారే హైదరాబాద్లో పడేటోళ్లు కావాల్నా..? దయచేసి ఆలోచించాలని కేసీఆర్ కోరారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.












Click it and Unblock the Notifications