సీఎం కేసీఆర్ మౌనం వెనుక - మారుతున్న సమీకరణాలు : ఢిల్లీ కేంద్రంగా - లెక్క పక్కాగా..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం వెనుక కారణం ఏంటి. కొంత కాలంగా సీఎం పూర్తిగా కామ్ అయిపోయారు. జాతీయ పార్టీ ఏర్పాటు అంటూ పార్టీ నేతలతో చర్చించిన ఆయన..పార్టీ వ్యవహారంతో పాటుగా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారిన రాష్ట్రపతి ఎన్నికల పైనా స్పందించటం లేదు. ఈ నెల 19న పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చటం పైన నిర్ణయం తీసుకుంటారని..అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో తన పాత్ర.. లక్ష్యాల పైన క్లారిటీ ఇస్తారని సమాచారం ఇచ్చారు. కానీ, సీఎం కేసీఆర్ ఇంకా సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉన్నారు.

కేసీఆర్ వ్యూహాత్మక మౌనం
బీజేపీ వ్యతిరేకులుగా ముద్ర పడిన కొందరు మేధావులతో ఇప్పటికే కేసీఆర్ చర్చలు చేసారు. ఇప్పుడు దేశంలో ప్రముఖ ఆర్దిక వేత్తలు.. రిటైర్డ్ బ్యూరోక్రాట్లు..పలు రంగాలకు చెందిన నిపుణులతో చర్చలు కొనసాగిస్తున్నారు. వారితో దేశంలో ప్రస్తుత పరిస్థితులు..పలు రంగాల్లో ఉన్న అవకాశాలు..సద్వినియోగం చేసుకోవటంలో ప్రభుత్వాల వైఫల్యాల పైనే ఎక్కువగా చర్చ చేస్తున్నట్లు సమాచారం. అటు జాతీయ స్థాయిలోనూ తన మిత్రులతో సీఎం కేసీఆర్ టచ్ లో ఉన్నట్లుగా సమాచారం. తాజాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాను విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా ప్రకటించన సమయంలో..తాను కేసీఆర్ తోనే చర్చించానని..ఆయన మద్దతు ఇస్తానని చెప్పారంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. కానీ, టీఆర్ఎస్ నుంచి మాత్రం అధికారికంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తారనేది ప్రకటించలేదు.

ఎవరెటో పూర్తి క్లారిటీతో
మమతా బెనర్జీ రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక అంశం పైన సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో..కాంగ్రెస్ తో కలిసి వేదిక పంచుకోవటం ఇష్టం లేని కేసీఆర్ దూరంగానే ఉన్నారు. ఇటు ఎన్డీఏ తమ అభ్యర్ధి నామినేషన్ సైతం దాఖలు చేసారు. రాష్ట్రపతి అభ్యర్ధులుగా పోటీ పడుతున్న ఇద్దరు త్వరలో ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కు రానున్నారు. ఇక, గిరిజన మహిళను ఎన్డీఏ అభ్యర్ధిగా ప్రకటించటంతో...గిరిజనులకు ప్రాధాన్యత కలిగిన పార్టీగా జేఎంఎం, తమ రాష్ట్రానికి చెందిన మహిళ కావటంతో బీజేడీ వంటి పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల వరకు ఎన్డీఏ అభ్యర్ధికే మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాలు - రాష్ట్రపతి ఎన్నికలకు వైరుధ్యం ఉండటంతో ప్రస్తుతం తాను పార్టీ ప్రకటించటం.. జాతీయ పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకొనే నిర్ణయాలతో అనేక రకాల చర్చలు వస్తాయనే అంచనాతో టీఆర్ఎస్ అధినేత ఉన్నట్లుగా తెలుస్తోంది.

జాతీయ పార్టీ ప్రకటన .. లెక్క పక్కా చేసాకే
దీంతో.. రాష్ట్రపతి ఎన్నికలు ముగిస్తే..ఇక, పూర్తిగా పార్టీల వైఖరి ఏంటనేది స్పష్టత వస్తుందనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. ఆ తరువాత తాను పార్టీ ప్రకటించటం ద్వారా జాతీయ స్థాయిలో చర్చకు అవకాశం ఏర్పుడుతుందనే అంచనాతో ఉన్నట్లుగా గులాబీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు పైన మాత్రం శరద్ పవార్ తో చెప్పిన విధంగానే యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చే ఛాన్స్ ఉంది. దీని పైన అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే వారం జూలై 2,3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. ఆ సమయంలో బీజేపీ తీసుకొనే నిర్ణయాల ను సైతం పరిగణలోకి తీసుకొని ..తన కార్యాచరణ ఖరారు చేసే దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. దీంతో..కేసీఆర్ రానున్న రోజుల్లో తీసుకొనే నిర్ణయాల పై ఉత్కంఠ నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications