తెలంగాణ నగరాలకు చైనా హంగులు: కెసిఆర్తో ప్రతినిధుల భేటీ
హైదరాబాద్: నగరంలోపాటు రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చైనాకు చెందిన మౌలికవసతుల కల్పన సంస్థలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆహ్వానించారు.
చైనాలోని అంజు ఇన్ఫ్రా సంస్థ సంచాలకులు యోగేష్వా, మనోజ్గాంధీ, రాడిక్ కన్సల్టెంట్స్ ఛైర్మన్ రాజ్కుమార్, వంతెనల రూపకల్పన (బ్రిడ్జి డిజైనింగ్) విభాగాధిపతి బీపీసింగ్ తదితర నిపుణుల బృందం బుధవారం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసింది. రాష్ట్ర మంత్రులు కెటి రామారావు, జూపల్లి కృష్ణారావు, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్కుమార్, హైదరాబాద్ మహానగరపాలక సంస్థ కమిషనర్ సోమేష్కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్రావు, అదనపు ముఖ్యకార్యదర్శి శాంతికుమారిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్లో చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకాన్ని కేసీఆర్ వారికి వివరించారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, మంచిర్యాల నగరపాలక సంస్థల్లోనూ అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. హైదరాబాద్లోని ప్రస్తుత రహదారులను అభివృద్ధి చేస్తామని, విస్తరణ ప్రాంతాలకు అవసరమైన రహదారులు, వంతెనలను నిర్మిస్తామని సీఎం చెప్పారు.
మూసీనదిపై తూర్పు నుంచి పడమర వరకు 42 కిలోమీటర్ల మేర ఆరు వరసల రహదారిని నిర్మిస్తున్నామన్నారు. దుర్గం చెరువుపై ఊయల వంతెన (సస్పెన్షన్ బ్రిడ్జి) నిర్మిస్తామన్నారు. వరంగల్, నల్గొండ, కరీంనగర్ తదితర జాతీయ రహదారులకు అనుబంధంగా ఎక్స్ప్రెస్ ఎలివేటెడ్ హైవేలను నిర్మిస్తామని చెప్పారు.
వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, గోదావరిఖని నగరపాలక సంస్థల్లో రింగురోడ్లు, అంతర్గత రహదారులను చేపడతామన్నారు. గోదావరినదిపై మరో మూడు చోట్ల పెద్ద వంతెనలు వస్తాయన్నారు. తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్, షాద్నగర్, వికారాబాద్, నర్సాపూర్ పట్టణాల వరకు రాజధాని నగరం విస్తరిస్తున్నదని, ఇందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కోసం బృహత్తర ప్రణాళికను రూపొందించామన్నారు.
రాష్ట్రంలోని 67 నగరపాలక సంస్థల్లో ఫ్త్లెఓవర్లు, పెద్ద రహదారులు, స్కైవేలు, మురుగునీటి పారుదల వ్యవస్థ, మంచినీటి సరఫరా, గృహనిర్మాణం కోసం శాస్త్రీయ విధానాలను చేపడతామని తెలిపారు.
తెలంగాణలోని నగరాల అభివృద్ధికి చైనాలోని బీజింగ్, షాంఘై, డేలియన్, సుజో, గాజో నగరాల ప్రణాళికలను రూపొందించిన సలహాసంస్థల సహకారం తీసుకుంటామన్నారు. ఇటీవల చైనా పర్యటన సందర్భంగా న్యూడెవలప్మెంట్ బ్యాంకుతో పాటు అనేక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చాయని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. త్వరలోనే మరోసారి సమావేశమై ఏయే పనుల్లో ఏ విధంగా భాగస్వాములు కావాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.
కాగా, హైదరాబాద్, ఇతర నగరాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను చైనా ఇన్ఫ్రా కంపెనీల ప్రతినిధులు సీఎంను అడిగి తెలుసుకున్నారు. రహదారులు, బ్రిడ్జిలు, సస్పెన్షన్ బ్రిడ్జిల నిర్మాణంలో పాలుపంచుకోవడానికి సిద్ధంగా తాము ఉన్నామని తెలిపారు.