కేసీఆర్ అత్యంత సీనియర్! వయసులో వనమా పెద్ద..! హరిప్రియ జూనియర్..!!
హైదరాబాద్: పాత కొత్త కలయికలతో తెలంగాణ శాసన సభ కొలువుదీరింది. ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన గులాబీ పార్టీ దాదాపు నెలన్నర తర్వాత తమ ఎమ్మెల్యేలతో శాసనసభలో ప్రమాణస్వీకార తంతు ముగించుకుంది. ఎక్కువ సార్టు గెలిచిన ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రికార్డు నెలకొల్పగా వయసులో అత్యంత పెద్దవాడుగా వనమా వెంకటేశ్వరరావు శాసన సభలో కాలు మోపారు. ఇక వయసులో అత్యంత పిన్న వయస్కురాలిగా బానోతు హరిప్రియా నాయక్ సభలో ప్రమాణ సీకారం చేసారు.
శాసనసభ్యుడుగా కేసీఆర్ రికార్డ్..! 8సార్టు గెలిచిన అభ్యర్తిగా ప్రమాణ స్వీకారం..!
తెలంగాణ రెండో శాసనసభ నేడు కొలువుదీరింది. గత ఎన్నికలతో పోల్చితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎంఐఎం పాత స్థానాలను తిరిగి నిలబెట్టుకోగా, మిగిలిన అన్ని రాజకీయ పక్షాల సీట్లు తగ్గిపోయాయి. 8సార్లు అసెంబ్లీకి ఎన్నికయిన నేతగా రికార్డు సృష్టించారు. ఈసారి అసెంబ్లీకి 23 మంది కొత్త ముఖాలు సభలోకి వచ్చాయి సీఎం కేసీఆర్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు..! లేడీస్ ఫస్ట్ అన్న కేసీఆర్..!!
1983లో రాజకీయ అరంగేట్రం నుంచి నేటి వరకు మొత్తం ఎనిమిదిసార్లు (ఉప ఎన్నికలు కలుపుకుని) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీకి ఎన్నికైన వారిలో కేసీఆర్ సీనియర్. ఒక్క 2009లో ఎంపీగా గెలిచారు. 1985 నుంచి ఇప్పటివరకు పోటీచేసిన అన్ని ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందుతూ వస్తున్నారు. కేసీఆర్ తర్వాత ఆరుసార్లు గెలిచిన నేతలుగా ప్రస్తుత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ఖాన్, సీనియర్ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్రావులు ఉన్నారు.
ఇతర సభల నుంచి అసెంబ్లీకి..! మల్లారెడ్డి, బాల్కసుమన్ కి అరుదైన అనుభూతి..!
ఎంపీలు సీహెచ్ మల్లారెడ్డి, బాల్కసుమన్, ఎమ్మెల్సీలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, మైనంపల్లి హనుమంతరావులు ఈసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయితే, 2014-18 మధ్య ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో 76 మంది మళ్లీ గెలవగా, 2009-2014 మధ్య ఎమ్మెల్యేలుగా గెలిచి 2014 ఎన్నికల్లో ఓడిపోయిన వారిలో 16 మంది తిరిగి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 23 మంది ఈసారి తొలిసారి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.
వయసులో పెద్దాయన వనమా..! చిన్నామె హరిప్రియ..!!
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు (73) వయసురీత్యా అందరికంటే పెద్దవారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం (72), ముంతాజ్ అహ్మద్ఖాన్ (70). ఈసారి అసెంబ్లీలో ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియా నాయక్ (29) అత్యంత పిన్నవయస్కురాలిగా గుర్తింపు పొందనున్నారు. ఆమె తర్వాత పైలట్ రోహిత్రెడ్డి (34), బాల్కసుమన్ (35), గ్యాదరి కిశోర్ (37)లు ఉన్నారు.