వెంకయ్య కూతురుపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
యువతలో చైతన్యం తీసుకొచ్చి ఉత్తమ పౌరులుగా తయారు చేసే లక్ష్యంగా స్వర్ణభారత్ కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్: యువతలో చైతన్యం తీసుకొచ్చి ఉత్తమ పౌరులుగా తయారు చేసే లక్ష్యంగా స్వర్ణభారత్ కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతలలో స్వర్ణభారత్ ట్రస్ట్ శాఖను సోమవారం ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు మనోహర్ పారికర్, వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ వెంకయ్యనాయుడు కూతురు, స్వర్ణభారత్ ట్రస్టు నిర్వాహకురాలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వెంకయ్యనాయుడు కుమార్తెగా దీపా వెంకట్ తలచుకుంటే రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందని, కానీ, ఆమెకు మాత్రం సమాజ సేవపైనే ఆసక్తి ఎక్కువ అని సీఎం కేసీఆర్ చెప్పారు. దీపా ఆధ్వర్యంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆమెను తమ ఇంటికి భోజనానికి పిలిచి ట్రస్ట్ కార్యక్రమాలపై మాట్లాడతానని అన్నారు.

ట్రస్ట్ మరింత విజయవంతం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లు చెప్పారు. సంఘం, సమాజం పురోభివృద్ధి కోసం స్వర్ణభారత్ ట్రస్టు చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. స్వర్ణ భారత్ హైదరాబాద్ చాప్టర్ను ప్రారంభించడం శుభపరిణామన్నారు. పట్టణాలకు వలస వెళ్లినవారు గ్రామాలకు తిరిగిరావాలనే లక్ష్యంతో ట్రస్టు కృషి చేస్తోందన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్.. గాంధీ సిద్ధాంతాలతో నడుస్తోందని కేసీఆర్ అన్నారు.
పంచాయతీరాజ్ వ్యవస్థలో దుష్పరిణామాలను సంస్కరించేందుకు స్వర్ణభారత్ ట్రస్టు కృషి చేయాలని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ట్రస్ట్ కార్యకలాపాలను విస్తరించాలని సీఎం ఈ సందర్భంగా కోరారు. స్థానిక స్వపరిపాలన అద్భుతంగా ఉంటేనే దేశ వికాసం సాధ్యమన్నారు.
పంచాయతీరాజ్ వ్యవస్థలో అభివృద్ధి కోసం ప్రభుత్వపర సాయం అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో దీపా వెంకట్ మాట్లాడుతూ.. సమాజానికి ఎంతో కొంత చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. సీబీఎస్ఈ సిలిబస్తో విద్యాలయాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్కు 10 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిన రామచంద్రరావుకు సన్మానం చేశారు.












Click it and Unblock the Notifications