అమరావతికి బయలుదేరిన కెసిఆర్: వెళ్తున్నానని దత్తాత్రేయ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బుధవారం బయల్దేరి వెళ్లారు. బుధవారం సాయంత్రం నల్లగొండ జిల్లా సూర్యాపేటకు ఆయన బయల్దేరారు. బుధవారం రాత్రికి సూర్యాపేటలోని మంత్రి జగదీష్ రెడ్డి నివాసంలో ఆయన బస చేస్తారు.
రేపు గురువారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు కేసీఆర్ సూర్యాపేట నుంచి అమరావతికి బయల్దేరుతారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు కేసీఆర్ తిరిగి హైదరాబాద్కు బయల్దేరుతారు. కెసిఆర్ వెంట తెలంగాణ మంత్రులు జగదీష్ రెడ్డి, ఈటెల రాజేందర్ ఉంటారు.
ఇదిలావుంటే, అమరావతి శంకుస్థాపన ఆహ్వానం తనకు అందిందని, రేపు ఉదయం కార్యక్రమానికి వెళ్తున్నట్లు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఈనెల 23న జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్య, నితిన్ గడ్కరీతోపాటు ఇరు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్ను ఆహ్వానించామని ఆయన తెలిపారు.
యాదగిరిగుట్ట-వరంగల్ నాలుగు లైన్ల రోడ్డు ప్రారంభోత్సవానికి ఈనెల 23న నితిన్ గడ్కరీ హైదరాబాద్ వస్తున్నట్లు చెప్పారు. నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి దత్తాత్రేయ భరోసా ఇచ్చారు.
ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణం కల్పించటానికే అలయ్బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ నెల 23న నిర్వహించే అలయ్బలయ్ కార్యక్రమంలో తెలంగాణలోని కళాకారులు,నృత్యకారులతో ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు.
పప్పు దినుసుల ధరలు పెరగటం ఆందోళనకరమైన విషయమన్నారు. కేంద్రం ఇప్పటికే 10వేల పప్పుదినుసులను దిగుమతి చేసిందని, రాష్ర్టాల అవసరాల మేరకు కోటా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పప్పు దినుసుల అంశలో కృత్రిమంగా కొరత సృష్టించేవారిపై, వాటిని అక్రమంగా నిల్వ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.