మైహోం రామేశ్వరరావుకు మొండిచెయ్యి.. పనిచేసిన కేసీఆర్ లాబీయింగ్??
రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్
విడుదల చేసింది. ఏపీలో మొత్తం నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలిగింటినీ అధికార వైసీపీ సునాయాసంగా చేజిక్కించుకుంటోంది. విజయసాయిరెడ్డి, బీజేపీకి చెందిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, కేంద్ర మంత్రి సురేష్ ప్రభుల పదవీ కాలం ముగిసిపోయింది. వీరిలో విజయసాయిరెడ్డిని తిరిగి రాజ్యసభకు పంపించాలని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించారు.

పారిశ్రామికవేత్తల పోటీ
మిగిలిన మూడు సీట్లలో ఒకటి అదానీ కుటుంబానికి కేటాయించారు. ఇక రెండుస్థానాల కోసం ఇప్పటికే పారిశ్రామికవేత్తల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. తెలంగాణకు చెందిన మైహోం జూపల్లి రామేశ్వరరావు ఇప్పటికే జగన్కు సంకేతాలు పంపించారు. అవసరమైతే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరతానని, తనను రాజ్యసభకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంతోపాటు పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రామేశ్వరరావుకు మొండిచెయ్యి చూపించినట్లు తెలుస్తోంది. దీనివెనక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాబీయింగ్ పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కేసీఆర్కు, జూపల్లికి దూరం పెంచిన సమతామూర్తి?
సమతామూర్తి విగ్రహావిష్కరణ తర్వాత కేసీఆర్కు, చినజీయరుకు దూరం పెరిగిన సంగతి తెలిసిందే. దీంతోపాటు మైహోం రామేశ్వరరావుకు కూడా అంతే దూరం పెరిగింది. కేసీఆర్, జగన్ సన్నిహితులు. ఆ కోణంలోనే రాజ్యసభ సభ్యత్వం దక్కలేదని సీనియర్ రాజకీయ వేత్తలు విశ్లేషిస్తున్నారు. సంబంధాలు బాగుంటే తెలంగాణ కోటా నుంచే జూపల్లిని ఎంపిక చేసేవారంటున్నారు.

వీరికి మొండిచెయ్యే!!
రాజ్యసభ సభ్యత్వం ఇస్తాననే హామీపై తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరిన నెల్లూరు జిల్లా బీసీ నేత బీద మస్తాన్రావు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని ఎంపిక చేసినట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. వీరితోపాటు రాజ్యసభ రేసులో నిలిచిన సినీ నటుడు అలి, వైవీ సుబ్బారెడ్డి, మర్రి రాజశేఖర్కు మరోసారి నిరాశ తప్పదనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఏదన్నాకానీ అధికారికంగా అభ్యర్థుల ప్రకటన వెలువడేవరకు వేచిచూడక తప్పదు.!!












Click it and Unblock the Notifications