20వేల కోట్లివ్వండి: మోడీతో 50ని.లపాటు కేసీఆర్ భేటీ, కీలక అంశాలపై వినతి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో విభజన చట్టం హామీలతో పాటు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టులకు సంబంధించి 10 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానికి కేసీఆర్ అందజేశారు.
కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలని, రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, మనోహరాబాద్-కొత్తపల్లి, అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్లను త్వరగా పూర్తిచేయాలని, కాజీపేట-కరీంనగర్ మధ్య రైల్వేలైన్ కోసం సర్వే చేయాలని కోరారు.
వీటితోపాటు, కొత్త సచివాలయం నిర్మాణానికి బైసన్ పోలో మైదాన స్థలాన్ని కేటాయించాలని, విభజన చట్టంలోని 9 వెనుకబడిన జిల్లాల(ఉమ్మడి జిల్లాలు) అభివృద్ధికి సహకరించాలని, రాష్ట్రానికి ఐఐఎం మంజూరు చేయాలని, హైదరాబాద్లో ఐటీఐఆర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని, జవహర్ నవోదయ విద్యాలయాల సంఖ్య పెంచాలని కేసీఆర్.. ప్రధానిని కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 80 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని, ఈ ప్రాజెక్టు వల్ల 20 జిల్లాల్లో 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందుతుందని తెలిపారు. మంచినీటికి, పారిశ్రామిక అవసరాలకు కూడా నీరు లభిస్తుందని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా కేటాయించిన రూ. 25 వేల కోట్ల నిధులతో పాటు ఆర్థిక సంస్థల నుంచి మరో రూ. 22 వేల కోట్ల రుణం పొందామని చెప్పారు. ఇంకా నిధుల అవసరం ఉందని.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి రూ. 20 వేల కోట్ల ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం అందించాలని ప్రధానికి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.