టీఆర్ఎస్ తో లక్ష్యం చేరిన కేసీఆర్ - బీఆర్ఎస్ టార్గెట్ రీచ్ అవుతారా..!!
నాడు తెలంగాణ సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ ఏర్పాటు. తెలుగు రాజకీయాల్లో ఒక సంచలనం. 21 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతోంది. దసరా ముహూర్తాన ఇప్పుడు జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్ఎస్ రూపకల్పన చేసారు. టీఆర్ఎస్ పేరు మారినా..తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం టీఆర్ఎస్ నిలిచిపోతుంది. జాతీయ స్థాయిలో బీజేపీ లక్ష్యంగా సీఎం కేసీఆర్ కొద్ది నెలలుగా ఈ జాతీయ పార్టీ ఏర్పాటు పైన కసరత్తు చేసారు. అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాక..విజయదశమి ముహూర్తాన పార్టీ ప్రకటన చేస్తున్నారు.
నాడు తెలంగాణ సాధనే లక్ష్యంగా..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. పిడికిలి పించి తెలంగాణ నినాదంతో కేసీఆర్ గులాబీ జెండాను ఎగురవేశారు. 2001 లో ఉప ఎన్నిక ద్వారా రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని కేంద్ర, రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకొని కొన్నాళ్లకు బయటకు వచ్చారు. 2009 ఎన్నికల్లో బాగా నష్టపోయిన గులాబీ పార్టీ... 2010 నుంచి క్రమంగా బలపడుతూ వచ్చింది.
2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షతో తెలంగాణ సాధనకు మార్గం సుగమమైంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్రంలో ఘన విజయాన్ని సాధించి అధికారం దక్కించుకుంది. ఆ తరువాత వరుసగా జరిగిన గ్రేటర్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా వెనక్కు తిరిగి చూడలేదు. అదే 2018 ఎన్నికల వేళ ముందస్తుకు వెళ్లే ధైర్యం ఇచ్చింది. 2018 చివర్లో అసెంబ్లీని రద్దు చేసి తిరిగి ప్రజలు తనకు అధికారం కట్టబెడతారనే నమ్మకంతో కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు.
రెండో సారి అధికారం - కొత్త రికార్డు
రెండో సారి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి కేసీఆర్ తన పాలనను పరుగులు పెట్టించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, హరితహారం, రెండు పడకల గదుల ఇళ్లు, కులవృత్తులకు తోడ్పాటు, వివిధ వర్గాల సంక్షేమం కోసం పథకాలను చేపట్టింది. ఇదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి.
తెలంగాణ పైన బీజేపీ ఫోకస్ పెట్టింది. అప్పటి వరకు సత్సంబంధాలతో కొనసాగిన ప్రధాని మోదీ- సీఎం కేసీఆర్ మధ్య రాజకీయంగా విభేదాలు మొదలయ్యాయి. అంతే ఒక్క సారిగా కేసీఆర్ తన రాజకీయ రూటు మార్చేసారు. కేంద్రంలో బీజేపీ పైన రాజకీయ అస్త్రం ఎక్కు పెట్టారు. జాతీయ స్థాయిలో కొనసాగుతున్న పాలన పైన మండిపడ్డారు. పలు సందర్భాల్లో ప్రధాని మోదీకి హెచ్చరికలు చేసారు. వచ్చే ఎన్నికల్లో మోదీని అధికారం నుంచి దించుతామని సవాల్ చేసారు. అనేక పార్టీల నేతలతో మంతనాలు చేసారు. బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి చర్చలు జరిపారు. వారి మద్దతు సంపాదించారు. ఫలితంగా జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటుకు నిర్ణయించారు. అనేక మంది మేథావులు - రైతులతో సుదీర్ఘంగా చర్చించారు. వారందరికీ దేశంలో అన్న అవకాశాలు - ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పైన వివరించారు. వారి మద్దతు పొందటంలో ఇదే కీలకంగా మారుతోంది.
జాతీయ పార్టీ దిశగా పక్కా ప్రణాళికలతో
టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేదికగానే జాతీయ రాజకీయాల్లో తన పాత్ర పైన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తెలంగాణ నమూనా దేశవ్యాప్తంగా అమలు కావాలని... దేశంలో రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. ప్రగతిశీల భారత్ ధ్యేయంగా కాంగ్రెస్, భాజపాతో సంబంధం లేకుండా ముందడుగు పడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. కొన్ని నెలలుగా జాతీయ రాజకీయాల అంశంపై ప్రధానంగా దృష్టి సారించిన కేసీఆర్... ఆ దిశగా కీలక అడుగు వేసేందుకు సిద్ధమయ్యారు. రెండు దశాబ్దాలకు పైగా తెలంగాణ కోసం ఉన్న రాజకీయ పార్టీని ఇక దేశం కోసం నడిపించాలని నిర్ణయించారు. ఈ రోజున విజయదశమి పర్వదినాన కేసీఆర్ తన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతూ తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా అందరినీ ఆకర్షించారు.