బీఆర్ఎస్లో మళ్ళీ పదవుల పందేరం.. స్వామికార్యం, స్వకార్యం నెరవేరేలా కేసీఆర్ నయా ప్లాన్!!
బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో కెసిఆర్ తన జాతీయ పార్టీకి కొత్త కమిటీలను ప్రకటించడానికి రెడీ అవుతున్నారు. స్వామి కార్యం స్వకార్యం రెండూ నెరవేరేలా కెసిఆర్ ఈ నేపథ్యంలో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో, కొత్త కమిటీలను ప్రకటించనున్న నేపథ్యంలో గులాబీ శ్రేణుల్లో పలువురికి మళ్లీ పదవుల పందేరం జరుగుతుందని ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక కేసీఆర్ జాతీయ పార్టీ పార్టీలో పదవులపై అసంతృప్తులకు అవకాశం కల్పించనుంది.
గులాబీ బాస్ కొత్త ప్లాన్.. జాతీయ పార్టీకి కమిటీలు
గులాబి బాస్ కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీకి కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలనే ప్లాన్లో ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, వచ్చే ఎన్నికలలో బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న గులాబీ బాస్ అందుకు తగ్గట్టుగా పార్టీ కమిటీలను వేసే పనిలో ఉన్నారు. హిందీ బాగా మాట్లాడగలిగిన వారిని, దేశ రాజకీయాలలో ప్రభావవంతంగా ముందుకు వెళ్ళగలిగే వారికి కమిటీలలో స్థానం కల్పించాలని కెసిఆర్ భావిస్తున్నారు.
పదవుల కోసం పడరాని పాట్లు పడుతున్న నాయకులు
ఇక ఈ క్రమంలో ఇప్పటికే గత టిఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిన, ఎలాంటి పదవులు లేని నాయకుల పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు బిఆర్ఎస్ కోఆర్డినేటర్ ల నియామకం తో పాటుగా అనుబంధంగా రైతు విభాగాన్ని కూడా కెసిఆర్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో చాలామంది పదవుల కోసం ఇప్పటికే లాబీయింగ్ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక కొందరు తమకు హిందీ పై పూర్తిగా పట్టు కోసం ట్యూటర్ లను పెట్టుకొని మరీ హిందీ నేర్చుకోవడానికి కుస్తీ పడుతున్నారని సమాచారం.
పార్టీ సీనియర్లకు జాతీయ స్థాయిలో అవకాశాలు ఇస్తే రాష్ట్రస్థాయిలో వాళ్ళతో భర్తీ
ఇదిలా ఉంటే బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి,జాతీయ స్థాయి కమిటీలు వేయనున్న గులాబీ బాస్, పార్టీ సీనియర్లకు జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పిస్తారని తెలుస్తోంది. రాష్ట్రస్థాయి నాయకులకు జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పిస్తే, రాష్ట్రస్థాయిలో ఏర్పడిన ఖాళీలలో ద్వితీయ శ్రేణి నాయకులతో కూర్పు చేస్తారని టిఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నారు. దీంతో కొంతమంది అసంతృప్తులకు పదవులు దక్కినట్టు అవుతుంది. గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకూ అన్ని కులాలు,మతాలు, వర్గాలకు సమతూకంగా పదవులు ఇస్తారని ప్రధానంగా చర్చ జరుగుతుంది.
కమిటీల ఏర్పాటుకు కసరత్తు.. త్వరలో ప్రకటన
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు తర్వాత జాతీయ రాజకీయాలపై గట్టిగా ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్, పార్టీ కార్యకలాపాల స్పీడ్ కూడా పెంచుతున్నట్టు తాజా పరిణామాలతో స్పష్టమవుతుంది. మొదటిగా మహారాష్ట్రలోని అమరావతిలో సభను ఏర్పాటు చేసి రంగంలోకి దిగుతున్న కేసీఆర్ ఢిల్లీలోనూ బహిరంగ సభ నిర్వహణకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈలోగానే కమిటీల ఏర్పాటు చేయనున్నట్టు, అందుకోసం కసరత్తులు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే చాలా మంది పదవులు రాలేదని తీవ్ర అసహనంతో ఉన్నవారికి, జాతీయ పార్టీ ఏర్పాటు అవకాశం కల్పించడంతో ఆయా వర్గాలలో మళ్లీ పదవులకోసం ఆశావహ దృక్పథం కనిపిస్తుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకుల ప్రకటన వెలువరిస్తారని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు.