కెసిఆర్ ఎత్తు: చంద్రబాబును కార్నర్ చేయడమే?
హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి ముందడుగు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కార్నర్ చేయడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఓటుకు నోటు కేసులో అవునన్నా, కాదన్నా చంద్రబాబు చిక్కుల్లో పడ్డారు. దాని నుంచి బయటపడడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో నీటి పారుదుల ప్రాజెక్టుల విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
నోటుకు ఓటు కేసు వ్యవహారాలు సాగుతుండగానే కెసిఆర్ వాటర్ గ్రిడ్ పైలాన్ను ప్రారంభించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి, డిండి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. కరువుతో విలవిలలాడుతున్న మహబూబ్నగర్ జిల్లాకు, ఫ్లోరైడ్ సమస్యతో సతమతమవుతున్న నల్లగొండ జిల్లాకు సాగునీరు, మంచి నీరు అందించడానికి వాటికి ఆయన శ్రీకారం చుట్టారు.
ఆ తర్వాత మంచి రోజులు లేకపోవడంతో కెసిఆర్ వరుసగా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. పాలమూరు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన తర్వాత జరిగిన బహిరంగ సభలో కెసిఆర్ చంద్రబాబుపైనే కాకుండా ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుపై, రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ నాయకులే కాకుండా తెలంగాణ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నాయకులు కూడా మండిపడుతున్నారు.
డిండి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సందర్భంగా కూడా ఆయన చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు నోటుకు ఓటు కేసులో చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన ఆరోపణలకు ధీటుగా ఆయన ప్రతిస్పందిస్తూ దొరికిన దొంగ అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వెంటనే నీటి పారుదల ప్రాజెక్టుల అంశాన్ని వివాదంగా మార్చారు.