టిడిపి ఖతమ్: ఇక కాంగ్రెస్ పని పట్టనున్న కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ దాదాపుగా తెలుగుదేశం పార్టీని ఖతం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు ఇక కాంగ్రెసు పని పట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చిట్టెం రామ్మోనహన్ రెడ్డితో ఆ పని ప్రారంభమైనట్లు భావిస్తున్నారు.
కాంగ్రెసు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు పలువురు టిఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. శాసనసభ ఈసారి సమావేశం అయ్యేలోగా కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా లేని పరిస్థితిని తెచ్చేందుకు టిఆర్ఎస్ వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెసు 21 స్థానాలు గెలుచుకుంది. అందులో నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణించారు. దాంతో జరిగిన ఉప ఎన్నికలో ఆ సీటు టిఆర్ఎస్కు దక్కింది. పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఇటీవలే మరణించారు.
ప్రస్తుతం కాంగ్రెస్కు మిగిలింది 19 మంది శాసనసభ్యులు. ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్లోకి ఫిరాయించారు. దాంతో కాంగ్రెసుకు ప్రస్తుతం 14 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరిలో ఇంకా ఎంత మంది టిఆర్ఎస్ బాట పడుతారనేది తెలియని పరిస్థితి ఏర్పడింది.
శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 10 శాతం సభ్యులు ఉండాలి. అంటే 119 సీట్ల సభలో కనీసం 12 మంది ఉండాలి. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్లోకి ఫిరాయిస్తే కాంగ్రెసు ప్రతిపక్ష హోదా గల్లంతవుతుంది.
మహబూబ్నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టిఆర్ఎస్ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు టికెట్ గ్యారంటీ ఇస్తే తాము టిఆర్ఎస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు వారు సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది.