దొరను అడిగే దమ్ములేదు: సతీష్, వర్సిటీ వీసిలపై కెసిఆర్ కీలక వ్యాఖ్య
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాకు రూ.1000 కోట్లు కేటాయిస్తే ఏడాదిలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చునని తెలుగుదేశం పార్టీ నేత సతీష్ మాదిగ మంగళవారం అన్నారు. దొరను నిధులు అడిగే దమ్ము టిఆర్ఎస్ నేతలకు లేదని ఆరోపించారు.
పాలమూరు - రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు నిర్మించాలన్న ఉద్దేశ్యం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రసేఖర రావుకు లేదని, ప్రాజెక్టును వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోన్నారని ఆయన ఆరోపించారు.
డబుల్ బెడ్రూమ్స్ కట్టించి ఇస్తాం: కేసీఆర్
సనత్ నగర్, కూకట్పల్లి పరిధిలోని ఇందిరానగర్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం పర్యటించారు. ఇందిరానగర్లో రహదారులు, ఇళ్లను సీఎం పరిశీలించారు. బస్తీలో ప్రజల సమస్యలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.
నగరంలోని బస్తీల్లో దాదాపు రెండు లక్షలు కుటుంబాలు నివశిస్తున్నాయని తెలిపారు. వీరందరికీ దశల వారీగా డబుల్ బెడ్రూమ్స్ నిర్మించి ఇస్తామన్నారు. ఇందిరా నగర్ బస్తీవాసులకు జీ-ప్లస్2 పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేపడుతామన్నారు. లేఅవుట్ నమూనాలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
కాగా, క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ తెలంగాణలోని యూనివర్సిటీలపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, విద్యా శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల పాలన వ్యవస్థను గాడిన పెట్టాలన్నారు. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా విశ్వవిద్యాలయ చట్టాలు రూపకల్పన చేయాలన్నారు.
విశ్వవిద్యాలయాలకు ఒకే వ్యక్తి వీసీగా ఉంటే పర్యవేక్షణ కష్టమవుతోందని, విశ్వవిద్యాలయాల ప్రాధాన్యతకు అనుగుణంగా నిపుణుల నియామకం చేపట్టాలన్నారు. వీసీ నియామక అధికారం ప్రభుత్వానికి ఉండాలన్నారు. వీసీలు, రిజిస్ట్రార్ల నియామకల మార్గదర్శకాల రూపకల్పన చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ జేఎన్టీయూ రిజిస్ట్రార్గా ఆచార్య యాదయ్యను సీఎం నియమించారు.
ఆంధ్రా పాలనలో మూసీ నిర్లక్ష్యం: హరీష్
సీమాంధ్ర పాలనలో మూసీ నది నిర్లక్ష్యానికి గురైందని మంత్రి హరీష్ రావు వేరుగా మండిపడ్డారు. రోజు రోజుకు మూసీ ఆయకట్టు తగ్గుతూ వచ్చిందన్నారు. ప్రస్తుతం గేట్ల మరమ్మతును చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే మరమ్మతులు పూర్తి చేసి మూసీ ఆయకట్టు మొత్తానికి నీరు అందిస్తామన్నారు.