మోడీది గొప్ప గెలుపు, ఏపీ విఫలం.. తెలంగాణ సాధించాం: చైనా వరల్ట్ ఎకనామిక్ ఫోరంలో కెసిఆర్
బీజింగ్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రసంగించారు. భారత్ పెట్టుబడులకు స్వర్గధామం అని, చైనా మార్కెట్ల గురించి ఆందోళన అవసరం లేదని, ఇలాంటి ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ చైనా నిలదొక్కుకుంటుందని చెప్పారు.
భారత్లో ఫెడరల్ వ్యవస్థ గొప్పగా పని చేస్తోందని, దేశ అభివృద్ధిలో రాష్ట్రాలది కీలక పాత్ర అన్నారు. భారత దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని, అభివృద్ధిలో నూతన శిఖరాలను అధిరోహించాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు.
పారిశ్రామిక అనుమతుల కోసం తెలంగాణలో టిపాస్ రూపంలో గొప్ప పాలసీ తీసుకు వచ్చామని చెప్పారు. అసెంబ్లీలో చట్టాన్ని తెచ్చి రెండు వారాల్లో అనుమతులు మంజూరు చేశామన్నారు. ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి విషయంలో భారత్ వైపు ప్రపంచం చూస్తోందన్నారు.
మోడీ గట్టిగా పని చేస్తున్నారు
సంస్కరణల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ గట్టిగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. భవిష్యత్తు మాదే అనే నమ్మకంతో పని చేస్తున్నామన్నారు. చైనా సహా ఇతర దేశాల పెట్టుబడిదారులు భారత్ రావాలన్నారు. అత్యున్నత పారిశ్రామిక విధానం ఉందని చెప్పారు.
పోరాడి తెలంగాణ సాధించాం
సుదీర్ఘ పోరాటంతో తాము తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. తెలంగాణ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా వచ్చిందన్నారు.
30 ఏళ్ల కిందటి చైనా వేరు
చైనా ఆర్థిక వ్యవస్థ ఇటీవల ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో దాని పైన కెసిఆర్ మాట్లాడారు. ముప్పై ఏళ్ల కిందటి చైనా వేరు, ఇప్పటి చైనా వేరు అన్నారు. ఎలాంటి ఒడిదుడుకులను అయినా ఎదుర్కొని చైనా నిలదొక్కుకుంటుందన్నారు.
టీమిండియాలా
పేదరిక నిర్మూలనకు, దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాల్లో భారత్లో ఎలాంటి సందిగ్ధత లేదన్నారు. దేశం సంస్కరణలతో ముందుకెళ్తోందన్నారు. ఆర్థిక వయ్వస్థ కచ్చితంగా సందిగ్ధంలో లేదని చెప్పారు. నీతి అయోగ్ టీమిండియాలా పని చేస్తోందన్నారు.
పరిశ్రమలకు అనుమతి
ఇబ్బందులు లేకుండా తాము పరిశ్రమలకు అనుమతులిస్తున్నామని కెసిఆర్ చెప్పారు. అనతికాలంలోనే 56 కంపెనీలకు అనుమతులిచ్చామన్నారు. రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించామని చెప్పారు. అతిపెద్ద మార్కెట్ గల భారత దేశంలో ఎదుగుదల ఎక్కువ అని చెప్పారు.
అంతర్జాతీయ ప్రమాణాలు భారత్ దేశానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. దీనిని మాకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ పారిశ్రామికవేత్తలను తాము ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పెట్టుబడులతో ముందుకు వస్తే కలిసి పని చేద్దామన్నారు. తద్వారా కలిసి అభివృద్ధి చెందుతామన్నారు.
ఉమ్మడి ఏపీ ప్రయోగం విఫలమైంది
ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దంన్నరపాటు పోరాడామని, తమది వేర్పాటువాద ఉద్యమం కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రయోగం విఫలమైందన్నారు. పదిహేను నెలల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. అప్పటి నుంచి ప్రజలు పూర్తి సంతోషంగా ఉన్నారని చెప్పారు.
కొత్త రాష్ట్రమైనా తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక విధానం తీసుకువచ్చామన్నారు. రెండు వారాల్లో అనుమతులు పొందే హక్కు పారిశ్రామికవేత్తలకు ఉండేలా ప్రత్యేక చట్టం రూపొందించామన్నారు. ప్రధాని నేతృత్వంలో ముఖ్యమంత్రులంతా అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.
రాష్ర్టాలకు కేంద్రం అధికంగా నిధులు, అధికారాలు ఇచ్చిందని, ప్రధాని సంస్కరణ మార్గంలో పయనిస్తున్నారన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధాని మోడీ గొప్ప విజయం సాధించారని చెప్పారు. అతిపెద్ద మార్కెట్ కలిగిన భారత్లో ఎగుమతులకు అవకాశాలు ఎక్కువ అన్నారు.
భారత్ ఇదే విధంగా ముందుకు వెళ్తుందన్న విశ్వాసం తమకుందన్నారు. కాగా, ఎమర్జింగ్ మార్కెట్ ఎట్ క్రాస్ రోడ్స్ అంశంపై సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్ర పాలన, దేశాభివృద్ధిపై తన అభిప్రాయాలను వెల్లడించారు.