ఓటుకు నోటు: చంద్రబాబు ఎత్తుగడపై కెసిఆర్ వ్యూహం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఆ కేసుపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నేతలు, తెలంగాణ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను ఆసరా చేసుకుని చంద్రబాబు దాన్ని రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, అందువల్ల జాగ్రత్తగా వ్యవహరించడమే మంచిదని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నోటుకు ఓటు కేసులో వరుసగా నోటీసుల జారీ, అరెస్టులు జరుగుతాయని ప్రచారం జరిగింది. అయితే, ఈ విషయంలో పెద్దగా కదలిక కనిపించడం లేదు. దీంతో సమస్య సద్దుమణిగే అవకాశం ఉందని, ఇద్దరు ముఖ్యమంత్రులు రాజీకి వచ్చారని ప్రచారం సాగుతోంది. కానీ, దాన్ని తుపాను ముందు ప్రశాంతతగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
నోటుకు ఓటు వ్యవహారంపై కెసిఆర్ అధికారులతో మాట్లాడడం మినహా, పార్టీ నాయకులతో చర్చించడం లేదు. చివరకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు విమర్శలు చేసినప్పుడు ఎవరు మాట్లాడాలో కూడా కెసిఆర్ నిర్ణయిస్తున్నారు. చంద్రబాబు రెచ్చగొట్టడం ద్వారా ఓటుకు నోటు వ్యవహారాన్ని పక్కదారి పట్టించాలని ప్రయత్నిస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని కెసిఆర్ మంత్రులకు సూచించారు.
ఆంధ్ర మంత్రులు రెచ్చగొట్టినా సంయమనం కోల్పోవద్దని, ఆధారాలతో కేసు పటిష్ఠంగా ఉండేట్టు చేయడం ముఖ్యం గానీ మీడియా సమావేశాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు ముఖ్యం కాదని కెసిఆర్ పార్టీ నాయకులకు సూచించినట్లు చెబుతున్నారు. దీంతో టిఆర్ఎస్ నాయకులు, తెలంగాణ మంత్రులు చంద్రబాబుపై ఎదురుదాడి నుంచి వెనక్కి తగ్గినట్లు భావిస్తున్నారు.
అయితే, ఓటుకు నోటు వ్యవహారం ఎటు మలుపుతిరుగుతుందో అని ఉభయ రాష్ట్రాల్లోనూ ప్రధాన రాజకీయ పక్షాల్లో ఆసక్తి నెలకొంది. కాగా, ఎన్డిఏ మిత్రపక్షంగా ఉన్న టిడిపి ఓటుకు నోటు వ్యవహారంలో ఇరుక్కు పోవడంతో తెలంగాణ బిజెపి నాయకులు మౌనంగా ఉండిపోక తప్పడం లేదు. రాష్ట్రంలో పరిణామాలను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకు వెళ్లడం మినహా ఈ అంశం తమకు సంబంధం లేదన్నట్టుగానే ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు.