ప్యాకేజీ మాకూ కావాలి, లేఖలు రాస్తా: కెసిఆర్, గుడుంబాపై వాదన
కరీంనగర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి భేటీ మేరకు ఆ రాష్ట్రానికి ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన నేపథ్యంలో తెలంగాణకూ ప్యాకేజీ కావాలని కోరడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సిద్ధమయ్యారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖలు రాస్తానని ఆయన చెప్పారు.
చీప్ లిక్కర్ ప్రవేశపెట్టాలనే తన ప్రతిపాదనను ఆయన సమర్థించుకున్నారు. సర్కార్ మద్యం పెట్టి గుడుంబాను తరిమి కొట్టాలని వరంగల్ మహిళలు తనను కోరినట్లు ఆయన తెలిపారు. ఆయన మంగళవారంనాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. గుడుంబాను పారదోలేందుకే చీప్ లిక్కర్ ను ప్రవేశపెట్టాలని చూస్తున్నామని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీపై ప్రతిపక్షాలు చిల్ల రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్సించారు.
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ను మార్చి తీరుతామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ప్రస్తుత డిజైన్తో రంగారెడ్డి జిల్లాకు నీళ్లు రావని ఆయన అన్నారు. ప్రాణహిత ప్రాజెక్ట్ను రీడిజైనింగ్ చేసి 200 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే దేవాదుల ప్రాజెక్ట్ డిజైన్ సరిగా లేదని, దేవాదుల ప్రాజెక్ట్కు రూ. 7,500 కోట్లు ఖర్చు చేశారని, ఆ డబ్బును అప్పటి నాయకులే జేబులో వేసుకున్నారని ఆయన అన్నారు.
ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ అచ్చిరాలేదని, కానీ ఆ స్థలం మాత్రం చాలా గొప్పదని, దాన్ని కాళేశ్వరంగా పేరు మార్చి ప్రాజెక్ట్ కట్టాలని చూస్తున్నామన్నారు. అలాగే ఇంద్రావతి, ప్రాణహిత నదులపై మాత్రమే ప్రాజెక్ట్లు కట్టేందుకు అవకాశం ఉందన్నారు. త్వరలోనే ఇరిగేషన్ పాలసీని తీసుకొస్తామన్నారు.
దుమ్ముగూడెం ప్రాజెక్టుపై 720 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని ఆయన అన్నారు. పోలవరం ముంపు మండలాలను బలవంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారని ఆయన తప్పు పట్టారు. ఆర్టీసి బస్సులను టోల్ ఫీజు నుంచి మినహాయించే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. మహారాష్ట్ర గోదావరినదిపై 200 బ్యారేజీలు నిర్మించినట్లు ఆయన తెలిపారు.