కేసీఆర్ కు సీన్ అర్ధమైందా ? మోడీ-చంద్రబాబుకు కలిపి మోత ! 2018 రిపీట్ కానుందా?
తెలంగాణలో 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ మరోసారి గెలుస్తారనే ఆశలు అడుగంటాయి. అదే సమయంలో కేసీఆర్ కు కాంగ్రెస్-టీడీపీ పొత్తు రూపంలో ఓ భారీ అస్త్రం దొరికింది. దీన్ని సరిగ్గా వాడుకున్న కేసీఆర్ ఆంధ్రా సెంటిమెంట్ ను రెచ్చగొట్టడమే కాకుండా ఆ ఎన్నికల్లో చాలా సులువుగా బయటపడ్డారు. దీంతో అప్పటివరకూ కేసీఆర్ ను గద్దెదింపొచ్చని కలలుకన్న విపక్ష పార్టీలన్నింటికీ భారీ షాక్ తగిలినట్లయింది. ఇప్పుడు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీఆర్ ఈ అస్త్రాన్నే ప్రయోగించబోతున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ వర్సెస్ బీజేపీ పోరు
తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్ వర్సెస్ బీజేపీ పోరు సాగుతోంది. ఈ పోరు కాస్తా జాతీయ స్దాయిలో కేసీఆర్ కొత్త పార్టీ పెట్టే వరకూ వెళ్లిపోతోంది. జాతీయ స్ధాయిలో బీజేపీని ఎదుర్కోవాలంటే ఇప్పటికిప్పుడు జాతీయ పార్టీ పెట్టి పలు ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని ముందుకెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమైపోతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దెదింపేందుకు బీజేపీ భారీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే టీడీపీతో పాటు ఆ పార్టీకి దగ్గరగా ఉండే సినీ నటులు, మీడియా సంస్ధలు కూడా బీజేపీకి దగ్గరైపోతున్నారు. ఇది కేసీఆర్ ను చికాకుపెడుతోంది.
బీజేపీకి టీడీపీ సాయం
తెలంగాణలో ఎలాగైనా కేసీఆర్ ను గద్దెదించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఆయన జాతీయస్ధాయిలో తమపై మొదలుపెడుతున్న పోరుకు అస్సలు బెదిరేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్రలతో కేసీఆర్ పై అమాంతం ఒత్తిడి పెంచేస్తోంది. అంతే కాదు ప్రస్తుతం తెలంగాణను వదిలిపెట్టి ఏపీ రాజకీయాలకే పరిమితమవుతున్న టీడీపీని సైతం దగ్గర చేస్తోంది. తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా అధికారం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి అండగా నిలవడం ద్వారా తమ ఉనికి చాటుకునేందుకు, గతంలో కేసీఆర్ తమతో వ్యవహరించిన దానికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.
కేసీఆర్ కు అర్ధమైన సీన్
తెలంగాణలో ఓవైపు బీజేపీతో పోరాడుతున్న కేసీఆర్ కు ఇప్పుడు ఆ పార్టీతో అంటకాగేందుకు సిద్ధమవుతున్న టీడీపీతో కూడా పోరాడాల్సిన అవసరం ఏర్పడింది. ఇన్నాళ్లూ తనకు అండగా నిలుస్తున్న టీడీపీ సానుభూతిపరుల్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది. దీంతో పరిస్ధితుల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ టీడీపీ-బీజేపీ వైపు మొగ్గుతున్న మీడియా సంస్ధలతో పాటు చంద్రబాబు సామాజిక వర్గ నేతల్ని కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేయాల్సి వస్తోంది. ఇందులో భాగంగా మరోసారి తన పాత అస్త్రాన్ని కేసీఆర్ బయటికి తీస్తున్నారు. అదే తెలంగాణ సెంటిమెంట్.
2018 గేమ్ ప్లాన్ రిపీట్?
బీజేపీ దూకుడు, టీడీపీ రీఎంట్రీ ప్రయత్నాలతో రాష్ట్రంలో మారుతున్న రాజకీయాన్ని తిరిగి తమవైపు తిప్పుకోవాలంటే తిరిగి కేసీఆర్ కు మిగిలిన దారి తెలంగాణ సెంటిమెంటే. అందుకు కావాల్సిన గ్రౌండ్ ప్రిపేర్ చేసే పనిలో ఆయన బిజీగా కనిపిస్తున్నారు. ఓవైపు జాతీయ స్దాయిలో బీజేపీతో పోరాడేందుకు జాతీయ పార్టీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్.. నిన్న అసెంబ్లీలో పోలవరం ముంపు మండలాలు, సీలేరు విద్యుత్ కేంద్రం ఏపీకి ఇచ్చేయడం సహా తెలంగాణకు వ్యతిరేకంగా బీజేపీ తీసుకున్న నిర్ణయాలు, వాటి కోసం చంద్రబాబు అప్పట్లో పట్టుబట్టడం వంటి అంశాల్ని కేసీఆర్ తెరమీదకు తెచ్చేశారు. తద్వారా 2018 గేమ్ ప్లాన్ మళ్లీ రిపీట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.