మనకు మోడీ చేసిందేం లేదు! డబ్బుల మళ్లింపు వారికి తెలియకే జరిగిందా: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీకి చెందిన ఎంపీలతో వ్యాఖ్యానించారని తెలుస్తోంది. విభజన హామీలు కూడా నెరవేర్చలేదని వ్యాఖ్యానించారని సమాచారం. ఎంపీలు కెసిఆర్ను గురువారం ఆయన నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. 21వ తేదీ నుంచి జరగబోయే పార్లమెంటు సమావేశాలపై ఈ సందర్భంగా చర్చించారు. హైకోర్టు విభజనపై సహకరించాలని కోరేందుకు తాము గవర్నర్ను కలిసిన విషయాన్ని కెసిఆర్కు తెలిపారు.
దీనికి కెసిఆర్ స్పందిస్తూ... హైకోర్టు అంశాన్ని ఎప్పుడో తేల్చాల్సింది కానీ నాన్చుతూ వస్తున్నారని అసహనం వ్యక్తం చేశారని సమాచారం. రాజ్యాంగం ప్రకారం ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టు ఉండాలని, తెలంగాణ ఏర్పడి సంవత్సరమైనా హైకోర్టు ఏర్పాటు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించడంలేదన్నారు.
రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించడంపై కేంద్రం దృష్టి సారించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏడాదిగా తెలంగాణకు సంబంధించి ఒక్క ప్రాజెక్టును కూడా కేంద్రం ఆమోదించలేదన్నారు. విద్యుత్ ప్లాంట్లకు సంబంధించి పర్యావరణ అనుమతులు మాత్రమే వచ్చాయన్నారు.
తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ఆదాయ పన్ను చెల్లించలేదన్న కారణంతో ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్బీఐ రూ.1274 కోట్లను మళ్లించిందని, కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఇది జరగదని అనుమానం వ్యక్తం చేశారు.
కార్పొరేషన్ల విభజనపై వేసిన షీలాబిడే కమిటీ ఇంకా నివేదిక ఇవ్వలేదని, కమలనాథన్ కమిటీ కూడా అలాగే ఉందన్నారు. పార్లమెంటు సమావేశాల్లో విభజన చట్టాలపై కేంద్రాన్ని నిలదీయాలని ఆయన ఎంపీలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని అంశాలవారీగా ఎండగట్టాలని సూచించారు.