15ఏళ్ల తర్వాత వెంకన్న దర్శనానికి సిద్దమైన కేసీఆర్!
ఈ నెలాఖరులోగా తిరుమలను దర్శించుకుని మొక్కు చెల్లించుకోనున్నారు కేసీఆర్.
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉన్న దైవభక్తి గురించి అందరికీ తెలిసిందే. మొక్కులు చెల్లించడంలో.. యాగాలు చేయించడంలో.. ఆయనకు ఆయనే సాటి. దైవ సంకల్పాన్ని బలంగా నమ్మే కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో.. రాష్ట్ర సాధనకై పలు పుణ్య క్షేత్రాలకు మొక్కుకున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమై.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడా మొక్కులన్నింటిని చెల్లించే పనిలో పడ్డారు కేసీఆర్. ఇప్పటికే వరంగల్ భద్రకాళి, జోగులాంబ వంటి పుణ్యకేత్రాల్లో మొక్కు చెల్లించుకున్న కేసీఆర్.. అమ్మవార్లకు భారీ కానుకలు సమర్పించిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు కలియుగ దైవంగా భావించే శ్రీనివాసుడి వంతు వచ్చేసింది. ఈ నెలాఖరులోగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కు చెల్లించుకోనున్నారు కేసీఆర్. కుటుంబ సమేతంగా ఆయన తిరుమలను దర్శించుకోనున్నారు. విశేషమేమిటంటే.. 2001 తర్వాత.. అంటే, దాదాపు 15ఏళ్ల తర్వాత తిరుమలలో అడుగుపెట్టబోతున్నారు కేసీఆర్. 2001లో చివరిసారిగా ఆయన తిరుమలను సందర్శించారు. గతేడాది అమరావతి శంకుస్థాపన తర్వాత కేసీఆర్ మళ్లీ ఏపీలో అడుగుపెట్టే సందర్బం కూడా ఇదే కావడం విశేషం.












Click it and Unblock the Notifications