గుట్టను తిరుమలలా చేస్తా: కేసీఆర్, విహెచ్ ఆగ్రహం
హైదరాబాద్/నల్గొండ: తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టను తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం చెప్పారు. కేసీఆర్ ఉదయం యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వామి వారికి స్వర్ణ గోపురం కట్టిస్తామని తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రాలను నిర్మిస్తామన్నారు. స్వామి వారి గర్భగుడి ఎత్తును పెంచుతామని తెలిపారు. పారిశ్రామికవేత్తల సహకారంతో గుట్టను తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
భక్తుల కోసం గుట్ట పైన కాటేజీలు నిర్మిస్తామని తెలిపారు. గోపురానికి బంగారు తాపడం చేయిస్తామన్నారు. రెండు వేల ఎకరాల్లో ఆధ్యాత్మిక కేంద్రాలు, ఉద్యానవనం, కాటేజీలు, విల్లాలు, వేద పాఠశాల నిర్మిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రే పట్టు వస్త్రాలు తెచ్చే సంప్రదాయం తీసుకు వస్తామని చెప్పారు. అంతకుముందు, కేసీఆర్ చెరువుల పైన ఏరియల్ సర్వే చేశారు.
కేసీఆర్ పైన టీ కాంగ్రెస్ నిప్పులు
కేసీఆర్ పైన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు నేతలు శుక్రవారం ధ్వజమెత్తారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ తదితరులు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉందని, అందుకే భరోసా యాత్ర చేపట్టామన్నారు. రైతులు బంగారం, వెండి అడగటం లేదని, కేవలం విద్యుత్ మాత్రమే అడుగుతున్నారన్నారు.
కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వెల్లోనే 18 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన హక్కులను కాపాడుకోలేక విద్యుత్ను తీసుకు రాలేకపోయారని కేసీఆర్ పైన ఆరోపించారు. ఇది ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వమని ధ్వజమెత్తారు.
లిమిటెడ్ కంపెనీలా: విహెచ్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు తెలంగాణ పీసీసీ పైన వేరుగా మండిపడ్డారు. టీపీసీసీ లిమిటెడ్ కంపెనీగా మారిందన్నారు. పార్టీ కార్యక్రమాలు కొందరు నేతలే చేసుకుంటున్నారని విమర్శించారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ పైన కూడా విమర్శలు గుప్పించారు.