జాతీయ పార్టీ పెట్టాలని కేసీఆర్ నిర్ణయం: పార్టీ పేరు ఇదే, దేశ రాజధానిలో త్వరలో ప్రకటన?
హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, విప్లు, ఫ్లోర్ లీడర్లతో కేసీఆర్ శుక్రవారం రాత్రి కీలక సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిణామాలు, రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
మనమే కొత్త జాతీయ పార్టీ పెడదామన్న కేసీఆర్
ముఖ్యంగా జాతీయ రాజకీయాలపైనే కేసీఆర్ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ దేశంలో బీజేపీని ఎదుర్కొనే పరిస్థితిలో లేదని, కాంగ్రెస్ పని అయిపోయిందని కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా మనమే కొత్త పార్టీని తీసుకువద్దామని కేసీఆర్ నేతలకు చెప్పినట్లు సమాచారం.
తమ జాతీయ పార్టీ పేరు ఖరారు చేసిన కేసీఆర్
ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీలే కేంద్రంలో చక్రం తిప్పాయి. అయితే, ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం అవసరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ రెండు పార్టీలు దేశ ప్రజల ప్రయోజనాలకు పెద్ద పీట వేయలేకపోయాయని, కేంద్రంలో మరో బలమైన పార్టీ కావాలని అన్నారు. అందుకే జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. అంతేగాక, ఈ పార్టీకి భారత్ రాష్ట్రీయ సమితి/భారత్ రాష్ట్ర సమితిగా పేరును కూడా ఖరారు చేసినట్లు తెలిసింది.
దేశ రాజకీయాల్లోకి కేసీఆర్.. ఢిల్లీలో పార్టీ పేరు ప్రకటన
టీఆర్ఎస్ పార్టీనే భారత్ రాష్ట్రీయ సమితిగా మార్చనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. జాతీయ స్థాయిలో పార్టీ పెట్టాలని నిర్ణయించిన కేసీఆర్.. ఈ పార్టీని దేశ రాజధాని ఢిల్లీలోనే ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఢిల్లీ వేదికగానే త్వరలోనే భారత్ రాష్ట్రీయ పార్టీని కేసీఆర్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. రాష్ట్రంలో ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.