కేసీఆర్ రోజూ ధరణి పోర్టల్ చూస్తారు... అందుకే: జోడోయాత్రలో రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. భారత్ జోడో యాత్రలో భాగంగా మూడవ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ కేంద్రంలోని అధికార బీజేపీపై, రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
టిఆర్ఎస్, బిజెపి రెండు ఒకటే
బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి, టీఆర్ఎస్ మద్దతు పలుకుతుందని పేర్కొన్న ఆయన, అనేక అంశాలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. ఉభయ సభల్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు గా ఉందని, కానీ ఇక్కడ మాత్రం డ్రామాలు ఆడుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. టిఆర్ఎస్, బిజెపి రెండు ఒకటేనని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేస్తున్న బీజేపీ, టీఆర్ఎస్
ఢిల్లీలో మోడీ, తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉండి వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలకు సమదూరం పాటిస్తుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రెండు పార్టీలు ఒకదానికొకటి అంటకాగుతూ బయటకు మాత్రం జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. రెండు పార్టీలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయని రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. పార్లమెంట్లో బిజెపి ఏ బిల్లు పెట్టిన తు.చ.తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీఎస్టీ చట్టంలో మార్పులు తీసుకొస్తామని తెలిపారు.

కేసీఆర్ ధరణి పోర్టల్ చూసేది అందుకే
ఇక తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతుందని రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతి సాయంత్రం ధరణి పోర్టల్ చూస్తారని పేర్కొన్న రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎక్కడ ఏం కొన్నారు అని కెసిఆర్ నిత్యం చూస్తారన్నారు. అంతేకాదు ఎక్కడ ఎక్కడ తమకు ఉపయోగపడే భూములున్నాయి. ఎవరి భూములు లాక్కోవాలి వంటి అనేక అంశాల కోసం సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ చూస్తారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.

అధికారంలోకి వస్తే అటవీహక్కుల చట్టం పూర్తి స్థాయిలో అమలు చేస్తాం
తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో ధరణి పోర్టల్ లో జరిగే తప్పులను సరి చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇక అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దళితుల భూములపై వారికి పూర్తి హక్కులు కల్పిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. ఇక అటవీ హక్కుల చట్టం తో గిరిజనులకు తాము భూములు ఇచ్చామని, తెలంగాణ ప్రభుత్వం ఆ భూములను కూడా లాక్కుంటున్నదని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ హింసను ప్రోత్సహిస్తున్నాయి అని, విధ్వంసం సృష్టిస్తున్నాయి అని రాహుల్ గాంధీ ఆరోపించారు.












Click it and Unblock the Notifications